మేడిపల్లి, ఏప్రిల్ 28 : మేడిపల్లి సాయి ప్రియ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ల పై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కి తెలంగాణ రియాల్టర్ అసోసియోషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీశైలం ఫిర్యాదు చేశారు. సాయి ప్రియ వెంచర్లో సర్వేనంబర్ 5,8,9 లో 1995, నుండి 2002 మధ్యలో చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి కొంతమంది వ్యక్తులు విక్రయించారన్నారు. 127 ఎకరాలు ఉన్న వెంచర్లో 77 గజాలు ప్లాట్లకు 16 నుండి 29 ప్లాట్ల వరకు అక్రమ రిజిస్ట్రేషనులు చేశారన్నారు.
పక్క ప్లాట్లకు ఈ ప్లాట్కు సర్వేనంబర్ తేడా,జీపీఏ హోల్డర్ తేడా సరిహద్దు లలో తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. లేఅవుట్లో పార్కులను, రోడ్లను ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారన్నారు. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఈసీ చెక్ చేస్తే ఇంతకు ముందు జరిగిన ప్లాట్ల సర్వే నంబర్లు, జీపీఏ హోల్డర్ సరిహద్దులు తెలుస్తాయన్నారు. అన్ని తెలిసినా రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదులో వివరించారు. ఇందులో జిలా ్ల రిజిస్ట్రార్ పాత్ర ఉందన్న అనుమానం ఉన్నదన్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ వచ్చినప్పటినుండి అనేక అవకతవకలు,అక్రమ రిజిస్ట్రేషన్లు తమ దృష్టికి వచ్చియన్నారు. తక్షణం సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.