Putta Madhu | ఆపదలో ఉన్నవారు అన్నా అంటే.. తానున్నా అని ఆదుకొనే మంచి మనసున్న నాయకుడాయన. తన తల్లి పుట్ట లింగమ్మ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ఆర్థికంగా అండగా నిలిచారు. నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారు. సామూహిక వివాహాలు జరిపించారు. నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ ఇప్పించారు. అందరికీ అందుబాటులో ఉంటూ మనసున్న మారాజుగా వెలుగొందుతున్నారు.. ఆయనే పుట్ట మధుకర్.
పుట్ట మధుకర్ రాజకీయాల్లోనే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. నియోజకవర్గంలో వందలాది మంది పేద బిడ్డల పెండ్లిళ్లను తన సొంత ఖర్చులతో జరిపించారు. పేదింటి బిడ్డలకు పెద్దన్నగా నిలిచారు. రాష్ట్రంలో అత్యధిక సామూహిక వివాహాలు జరిపించిన వ్యక్తిగా చరిత్ర కెక్కారు. తంగెళ్లపల్లి భాగ్యమ్మ, మంథని బక్కమ్మలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారు. కరెంటు బిల్లు కట్టుకోలేని పేదల ఇంటి కరెంటు బిల్లులు, ఆర్థిక స్థోమతలేని అనేక మంది నిరుపేద పిల్లల హాస్టల్, స్కూల్ ఫీజులు చెల్లించి ఆప్తుడయ్యారు. నిరుద్యోగులకు ఉచిత జాబ్ మేళాలను నిర్వహించారు. విదేశీ చదువులు భారమైన విద్యార్థినీవిద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించారు.
పాఠశాల దశలోనే విద్యార్థి నేతగా మధుకర్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఎంపీటీసీగా గెలిచి మంథని ఎంపీపీగా సేవలందించారు. జెడ్పీటీసీగాను గెలిచారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తలపడి ఓటమిని చవిచూశారు. రెండోసారి 2014లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును ఓడించి చరిత్రను సృష్టించి తెలంగాణ తొలి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 నుంచి పెద్దపల్లి జెడ్పీచైర్మన్గా కొనసాగుతున్నారు.
పుట్టమధు రాజకీయాల్లో ఒక సంచలనం. సుదీర్ఘ రాజకీయ చరిత్రగల కుటుంబాన్ని ఢీకొట్టి మట్టికరిపించిన నేత. నూనుగు మీసాల వయస్సులోనే రాజకీయ చదరంగంలో పావులు కదుపుతూ అంచెలంచెలుగా ఎదిగిన కెరటం. విద్యార్థినేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మధు మంథని ప్రాంతంలో రాజకీయ ప్రాబల్యమున్న దుద్దిళ్ల కుటుంబాన్ని మట్టికరిపించి చరిత్రను సృష్టించారు. 60 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కంచుకోటను ఆయన బద్దలుకొట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న మధుకర్ తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.