హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నిరుడుతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆస్తికోసం హత్యల్లో 52 శాతం, చోరీల్లో 35 శాతం, లైంగికదాడుల్లో 17 శాతం తగ్గుదల నమోదైంది. పోలీసులు కేసులను సమర్థంగా నిరూపణ చేయడం వల్ల శిక్షలు ఆరు శాతం పెరిగాయి. ఈ మేరకు 2022 సంవత్సరం పోలీస్శాఖ వార్షిక నివేదికను డీజీపీ మహేందర్రెడ్డి గురువారం విడుదలచేశారు. ఎనిమిదేండ్లలో రాష్ట్ర పోలీస్ శాఖ సాధించిన విజయాలతో కూడిన బుక్లెట్ను కూడా విడుదల చేశారు. ఈ ఏడాది పోలీస్శాఖ సాధించిన విజయాలు, నేరాలను అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలను డీజీపీ మీడియాకు వివరించారు. పోలీస్శాఖ ఆధునికీకరణ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, టెక్నాలజీ వినియోగంతో తెలంగాణ పోలీసుశాఖ నేడు దేశంలోనే మెరుగైనశాఖగా ఎదిగిందని చెప్పారు. ఈ ఏడాది మూడు ఎన్కౌంటర్లు జరుగగా, వాటిల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్టు తెలిపారు. నేర నిరూపణ (కన్విక్షన్) రేటు 50 శాతం నుంచి 56 శాతానికి పెరిగిందని, 152 మందికి జీవితకాల శిక్ష పడిందని చెప్పారు. నేరాల నియంత్రణకు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా 18, 234 కేసులను ఛేదించినట్టు వెల్లడించారు.