వరంగల్ : విద్య, వైద్యం ఎక్కడైతే సమృద్ధిగా అందుతుందో అక్కడ అభివృద్ధి త్వరగా జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, పూర్వ విద్యార్థుల కమిటీలు, కార్పొరేట్, సంస్థల స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ ప్రజా ప్రతినిధులు, విద్యా కమిటీ చైర్మన్ లతో కలిసి మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే ఆదర్శవంతంగా తయారు చేయాలన్నారు. నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేర్చే విధంగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యా కమిటీ చైర్మన్ లు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
రాయపర్తి మండలంలో మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా 21 పాఠశాలలను మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశామని,12 అంశాలను ఆధారంగా చేసుకుని మరమ్మతులు చేపడతామన్నారు. మన పాఠశాలలో చదివి మంచి ఉన్నత స్థానంలో ఉన్న వారిని పూర్వ విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, యువకులు, స్వచ్ఛంద సంస్థ, కార్పొరేట్ సంస్థ ప్రతినిధులు కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నారు.
అనంతరం మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో మన బడి కార్యక్రమం అమలు పై సమీక్షించారు. బడులు బలోపేతం కోసం విద్యా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన, ఊరు మన బడితో పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు.