ఆదిబట్ల, జూలై 1: నల్లగొండ జిల్లా పోలీసుల ప్రత్యేక ఆపరేషన్లో బొంగుళూరు సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ సీసీఎస్ ఎస్సై విజయ్కుమార్ నాయకత్వంలోని బృందం వరుస దొంగతనాల నేపథ్యంలో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జూన్ 30న పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముఠాసభ్యుడు అల్లంశెట్టి సాయికిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి లభించిన సమాచారం ఆధారంగా 2007లో నర్సాపూర్ టౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భూష్మ శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో బొంగుళూరు సమీపంలో ఔటర్రింగ్ రోడ్డుపై అనుమానాస్పదంగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. వాహనం నుంచి దిగిన భూష్మ శ్రీకాంత్ నల్లగొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్గిరిపై కత్తితో దాడిచేసి తప్పించుకోవడానికి యత్నించాడు. ఆత్మరక్షణ కోసం హెడ్కానిస్టేబుల్ కాల్పులు జరుపగా బుల్లెట్ శ్రీకాంత్కు తగలడంతో అక్కడే పడిపోయాడు. గాయపడిన నిందితుడిని వనస్థలిపురం దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అనంతరం నల్లగొండకు తరలించారు. ఇతనిపై పలు జిల్లాల్లో చోరీ, హత్యకేసులు ఉన్నట్టు సమాచారం.