హైదరాబాద్, అక్టోబరు 13 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నియామవళిలో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు తరలించే డబ్బును అడ్డుకోవాలన్న లక్ష్యంతో తనిఖీలు చేపడుతున్నారు. నగదు, బంగారం రవాణా చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత మొత్తాన్ని తీసుకువెళ్లాలి, ఎలాంటి పత్రాలు, కారణాలు చూపించాలనే అంశాలపై కనీస అవగాహన కల్పించకుండా చేస్తున్న తనిఖీలపై సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తంఅవుతున్నది.
నగదు పట్టుకున్న సమయంలో పత్రాలు లేకుంటే ఎప్పటి వరకు పత్రాలు సమర్పించవచ్చు అనే విషయాలపై అవగాహన కల్పించడం లేదు. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆధారాలు చూపించినా కూడా పోలీసులు నగదు సీజ్ చేస్తున్నారని సమాచారం. తెలంగాణలో దసరాను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. ప్రతి ఇంట్లో కొత్త బట్టలు, ఆభరణాలు కొనుక్కొవడం సంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో పండుగ షాపింగ్ కోసం తీసుకెళ్లే డబ్బులను సైతం తనిఖీల పేరుతో సీజ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలను ఎవరు వ్యతిరేకించకపోయినా పోలీసులు, ఎన్నికల సంఘం ప్రజలకు కనీస అవగాహన, చైతన్యం తీసుకరావడంలో విఫలమయ్యాయనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.