హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఎల్పీజీ సరఫరాలో అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్రంలో 24/7 ‘మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను శనివారం సివిల్ సైప్లె శాఖ ఏర్పాటుచేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సరఫరాలోని ఇబ్బందులు గుర్తించేందుకు 1967 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గ్యాస్ సరఫరాను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుందని, సరఫరాలో ఉన్న అడ్డంకులను గుర్తించి సమస్యలను పరిష్కరించనున్నట్టు తెలిపారు.
రవాణా, లాజిస్టిక్స్, అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల నిల్వను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం చమురు కంపెనీలు వెంటనే జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని కోరారు. సరఫరాలో ఇబ్బందులను అధిగమించేందుకు ఇండియన్ ఆయిల్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్పీసీఎల్) ప్రతినిధులు, పోలీసులు, పరిశ్రమలు, పంపిణీదారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిరంతరం అందుబాటులో ఉండి పర్యవేక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.