ములుగు, మే 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు.. భారతదేశ, తెలంగాణ చరిత్రపై ప్రచురించిన నిపుణ పుస్తకాల్లో ఎంతో విలువైన సమాచారం ఉన్నదని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువత నైపుణ్యాన్ని మరింత పెంపొందించే అవకాశం ఉన్నదన్నారు. శనివారం ములుగు మండలం జాకారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐటీడీఏ ద్వారా ఉద్యోగార్థులకు ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రానికి చెందిన ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పింగిళి నాగరాజు 250 నిపుణ పుస్తకాలు, నోట్ పుస్తకాలను కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతులమీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. నిపుణ పుస్తకాలను అభ్యర్థులకు ఉచితంగా అందించడంపై నాగరాజును కలెక్టర్ అభినందించారు. నిరుద్యోగ యువత ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.