హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. రాత్రి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి ఒక్కసారిగా16.8 డిగ్రీల సెల్సీయస్కు పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.5 డిగ్రీల సెల్సియస్పైగా నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సీయస్పైన నమోదయ్యే అవకాశం ఉందని టీఎస్డీపీఎస్ పేర్కొంది. గురువారం ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం బలహీన పడి ఉత్తర అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8కిలోమీటరల్ ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని, కోస్తాంధ్ర మీదుగా ఒడిశా వరకు సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉన్నదని పేర్కొంది.
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో శనివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 15 నాటికి తూర్పు- మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్ మండలం అర్లి(టి)16.8 డిగ్రీలు, జీహెచ్ఎంసీ పరిధిలో కుత్బుల్లాపూర్20.5 డిగ్రీల సెల్సీయస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 13 జిల్లాల్లో చిరుజల్లులు కురిసినట్లు టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 3.38, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 1.33 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని వివరించింది.