హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు సంజీవనిగా మారిన కాక్టెయిల్ ఔషధాన్ని అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం నిమ్స్, గాంధీ దవాఖానల్లో మాత్రమే ఈ మోనోక్లోనల్ యాంటిబాడీ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో వీటిని పెద్దమొత్తంలో సమకూర్చుకొని జిల్లా దవాఖానలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఖరీదైన ఈ ఇంజెక్షన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. కార్పొరేట్ దవాఖానలకు వెళ్తున్న కరోనా రోగులు ముందుగా ఈ ఔషధం గురిం చే ఆరా తీస్తున్నారు. దవాఖానలు కూడా పెద్దమొత్తంలో వీటిని సమకూర్చుకొంటున్నాయి.
రెండురోజుల్లోనే వ్యాధి నయం
కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే మోనోక్లోనల్ యాంటిబాడీలతో కూడి న ఈ ఇంజెక్షన్ తీసుకొంటే కరోనా రోగులు కొద్ది గంటల్లోనే కోలుకోవడం ప్రారంభమవుతున్నది. రెండురోజుల్లోనే చాలా మంది కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్తున్నారు. 60 ఏండ్లుదాటినవారు, దీర్ఘకాలిక రోగాలున్నవారు, స్థూలకాయులు ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటున్నాయి. ప్రస్తుతం దీని ధర రూ.70 వేల దాకా ఉండగా, ప్రభు త్వ దవాఖానల్లో ఉచితంగా అందిస్తున్నారు. గాంధీ, నిమ్స్లో ఇవి 500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఔషధ సరఫరా సంస్థతో వైద్యాధికారులు సంప్రదింపులు జరిపారు.
దివ్యౌషధం
కరోనా వైద్యంలో కాక్టెయిల్ ఇంజెక్షన్ మంచి ఫలితాలిస్తున్నది. వైరీమియా ఫేజ్లో ఇవ్వడం వల్ల ఇది వైరస్ను న్యూట్రలైజ్ చేస్తున్నది. వైరస్ లోడ్ తగ్గించడంతో ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నది. ఈ ఇంజెక్షన్ తీసుకొన్న కొవిడ్ రోగులు రెండురోజుల్లో రికవరీ అయి వెళ్లి పోతున్నారు. దగ్గు, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలుండి మూడునాలుగు రోజులైనా తగ్గకుంటే ఈ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. మొదటి 7 రోజుల్లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. -డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్స్