హైదరాబాద్, జులై 14(నమస్తే తెలంగాణ): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి. ఇందుకు ఉదాహరణ సీఎమ్మార్ (బియ్యం) సేకరణ అనుమతుల అంశం. నెల రోజులకు పైగా రాష్ట్రం నుంచి నిలిచిపోయిన సీఎమ్మార్ సేకరణకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడి ఒప్పించానని బండి సంజయ్ ఈ నెల 8న ఢిల్లీలో గోయల్తో ఫొటో దిగి మరీ బడాయి మాటలు చెప్పుకొచ్చారు. రాష్ట్రం తప్పుల కారణంగా నెలకొన్న సీఎమ్మార్ సమస్యకు పరిష్కారం లభించిందని కూడా గొప్పలకు పోయారు. కానీ, ఆ మాటలు, ప్రకటనలు, ఫొటోలు ఉత్తుత్తివే అని తేలిపోయింది. ఫొటోలకు పోజులిచ్చి వారం రోజులు గడుస్తున్నా కేంద్రం నుంచి ఉత్తర్వులకు అతీగతీ లేదు.
రాష్ట్రంపై కేంద్రం రాజకీయ కక్షకు రైతులు బలవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీళ్లపాలవుతున్నది. రాష్ట్రంపై రాజకీయంగా కక్షగట్టిన కేంద్రం కుంటి సాకులతో రాష్ట్రం నుంచి సీఎమ్మార్ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నది. గత 7వ తేదీ నుంచి సీఎమ్మార్ను నిలిపేసింది. మిల్లుల్లో, గోదాముల్లో సుమారు రూ.22 వేల కోట్ల విలువైన 92 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉన్నది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మిల్లులు, గోదాముల్లోకి వర్షపు నీరు చేరడంతో అందులోని ధాన్యం తడిసి ముద్దవుతున్నది. నోటికాడికొచ్చిన కూడు కేంద్రం నిర్వాకం వల్ల పనికిరాకుండా పోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయినట్టు మిల్లర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంచిర్యాలలో ఓ మిల్లులోకి వర్షం నీరు చేరడంతో బియ్యం, ధాన్యం బస్తాలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. బీజేపీ నేతలకు రైతు కష్టం తెలియకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
కేంద్రం నిర్వాకం వల్ల చేతికొచ్చిన ధాన్యం పాడవుతుండటంతో రైతుల కష్టం, ధాన్యం విలువ తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. గత యాసంగి ధాన్యంలో కొంత మొత్తాన్ని వేలంవేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ యాసంగిలో ప్రభుత్వం 50.67 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ వర్షాలకు తడిసిన ధాన్యంలో సుమారు 10 లక్షల టన్నులను తొలి దశలో వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పౌరసరఫరాల శాఖ సీఎం కేసీఆర్కు పంపించనున్నది.