కాలుష్యకారకమైన ఫార్మాసిటీ హైదరాబాద్కు సమీపంలో కాకుండా, సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ప్రస్తుత ఫార్మాసిటీ భూముల్లో మెగా సిటీని ఏర్పాటు చేస్తాం.
– గత నెల 13న సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
ఔటర్ రింగ్ రోడ్డు – ఆర్ఆర్ఆర్ మధ్యలో పారిశ్రామికవాడల గుర్తింపు కోసం 500 నుంచి 1,000 ఎకరాల భూమిని సేకరించండి.
– గత నెల 18న అధికారులకుసీఎం రేవంత్రెడ్డి ఆదేశం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఫార్మాసిటీ ఔటర్ రింగ్ రోడ్డు – ఆర్ఆర్ఆర్ మధ్యలోనే ఉన్నది. పారిశ్రామికవాడల ఏర్పాటుకు అదే అనువైన స్థలమని భావిస్తే, అక్కడే ఏర్పాటు కానున్న ఫార్మాసిటీ రద్దు ఎందుకు?
– నిన్నటి వరకు అందరిలో తలెత్తిన సందేహం
Pharma City | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 1 (నమస్తే తెలంగాణ): జీరో డిశ్చార్జి విధానంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో కాలుష్యాన్ని సాకుగా చూపి ఫార్మాసిటీని రద్దు చేయటం ఏమిటి?.. అందరిలో ఇవే అనుమానాలు. రద్దు కారణం వెనుక కారణం కాలుష్యమేనా? ఉద్దేశపూర్వకమా? అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం సీఎం రేవంత్రెడ్డి మీడియా చిట్చాట్లో ఫార్మాసిటీని రద్దు చేయటం లేదని స్పష్టం చేశారు. 17 రోజుల వ్యవధిలోనే సీఎం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవటం వెనక కారణాలు ఏమై ఉంటాయి? అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, సీఎం తాజా నిర్ణయంతో రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెచ్చించిన రూ.3-4వేల కోట్లు వృథా కాకుండా ప్రయోజనం కలగనున్నది.
12,300 ఎకరాల భూసేకరణ పూర్తి
రంగారెడ్డి జిల్లా పరిధిలో దేశంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 12,300 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. మొదటి దశ అనుమతులు కూడా వచ్చాయి. తుది అనుమతులు అనంతరం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 300-350 కంపెనీలకు కేటాయింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కాలుష్యం కారణంగానే దాన్ని రద్దు చేస్తున్నట్టు సీఎం స్పష్టం చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కాలుష్యం పేరు చెప్పి దాన్ని రద్దు చేయటమేమిటని అప్పట్లో పలువురు పారిశ్రామికవేత్తలు విస్మయం వ్యక్తం చేశారు. కాలుష్యమే లేని జీనోమ్ వ్యాలీ అంశాన్ని లేవనెత్తారు. అక్కడ ఫార్మా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు, ఫార్మా తయారీ కంపెనీలు దాదాపు 113 వరకు ఉన్నాయి. జీరో డిశ్చార్జి విధానంలో వ్యర్థ జలాలను వంద శాతం శుద్ధి చేసి, ఆ జలాలను రీసైక్లింగ్ విధానంలో ఉపయోగించటంతోనే అక్కడ కాలుష్య సమస్య లేదు.
సీఎం విరుద్ధ ప్రకటనపై విస్మయం
ఫార్మాసిటీ రద్దు నిర్ణయం తర్వాత ఐదు రోజుల వ్యవధిలో సీఎం రేవంత్ పారిశ్రామిక రంగంపై సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా నాచారం, కాటేదాన్ వంటి పారిశ్రామికవాడలను హైదరాబాద్ నుంచి దూరంగా ఏర్పాటు చేయాలనే గత ప్రతిపాదనపైన అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు – ఆర్ఆర్ఆర్ మధ్యలోకి తరలింపు కోసం కొండలు, గుట్టలతో పడావుగా ఉన్న 500-1000 ఎకరాల భూములతో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాస్తవానికి నాచారం, కాటేదాన్ పారిశ్రామికవాడల్లో విపరీతమైన కాలుష్య కారక ప్లాస్టిక్, రసాయన, ఇతర ఉత్పత్తి రంగాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు రెడ్ క్యాటగిరీలో ఉన్నవే. ఇంతటి కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ఏర్పాటు చేయాలని భావించినపుడు, జీరో డిశ్చార్జితో ఏర్పాటయ్యే ఫార్మాసిటీకి కాలుష్యాన్ని కారణం చూపటం ఏమిటని అధికారుల్లో ప్రశ్నలు తలెత్తాయి. పైగా ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో 75 శాతానికి పైగా ప్రభుత్వ భూములే. అందులోనూ 40 శాతానికి పైగా గుట్టలు, ఏనెలు (సాగులో లేనివి) ఉన్నాయి. ఈ క్రమంలో ఫార్మాసిటీ రద్దు ఎంతవరకు సమంజసం అనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఎట్టకేలకు ఉపసంహరణ