CM Revanth Reddy | రవీంద్రభారతి, జనవరి 31(నమస్తే తెలంగాణ): గద్దర్ పేరిట కవులు, కళాకారులతోపాటు సినీరంగంలో పురస్కారాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. గద్దర్ జయంతి వేడుకలు బుధవారం రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించారు.
రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీగౌడ్, గద్దర్ సతీమణి విమల, కుమారుడు సూర్య, కుమార్తె వెన్నెల తదితరులు హాజరయ్యారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు, ప్రజా తెలంగాణ కోసం ప్రజాయుద్ధనౌక గద్దర్ గజ్జెకట్టి ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి రోజున పురస్కారాలు అందజేస్తామని, వచ్చే జయంతి నాటికి ట్యాంక్బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విప్లవయోధుడు గద్దర్
గద్దర్ గొప్ప విప్లవ యోధుడని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రశంసించారు. గద్దర్ కలలు కన్న ప్ర జా తెలంగాణ కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని చెప్పా రు. గద్దర్ను స్ఫూర్తిగా తీసుకుని ఇందిరమ్మ ప్రజా పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు గద్దర్ పాటలను కళాకారులు ఆలపించారు.