PRLI | కొల్లాపూర్, ఆగస్టు 21: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) ప్రాజెక్టు డ్రైరన్ నిర్వహించేందుకు సన్నద్ధమైనట్టు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి స్మితాసబర్వాల్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు ప్యాకేజీ-1, 3లో చేపడుతున్న పనులను ఆమె సోమవారం పరిశీలించారు. ప్యాకేజీ-1 టన్నెల్ మార్గంలో వెళ్లి పనులను పర్యవేక్షించారు. అనంతరం రెగుమాన్గడ్డ వద్ద ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయానికి చేరుకొని నీటి పారుదల ఉన్నతాధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్మితాసబర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువుకు నిలయంగా మారిన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని చెప్పారు.
వచ్చే నెల 3న మొదటి లిఫ్ట్లో డ్రైరన్ నిర్వహిస్తామని వెల్లడించారు. 15న నార్లాపూర్ రిజర్వాయర్ను కృష్ణాజలాలతో నింపుతామని తెలిపారు. అక్టోబర్ 15న ఏదుల, నవంబర్ 15న వట్టెం రిజర్వాయర్తోపాటు గ్రావిటీ కెనాల్ ద్వారా కరివెన రిజర్వాయర్కు జలాలను వదులుతామని చెప్పారు. నెల వ్యవధిలో దశల వారీగా పీఆర్ఎల్ఐలోని రిజర్వాయర్లను నింపే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయా..? అనే విషయమై అధికారులతో చర్చించామని తెలిపారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులో పంపింగ్ విజయవంతమవుతుందన్న నమ్మకం ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రభుత్వసలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్రావు, చీఫ్ ఇంజినీర్ హమీద్ఖాన్, మిషన్ భగీరథ సీఈ చెన్నారెడ్డి, ఈఈ లు శ్రీనివాస్రెడ్డి, సంజీవరావు, అధికారులు పాల్గొన్నారు.