కరీంనగర్ : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం మొగదుంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పథకం కింద నిర్మించిన ఇండ్లకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పేదల కల సాకారం అయిందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న ఆలోచన రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
దశలవారీగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మగ్దుంపూర్ గ్రామంలో 52 మందికి గాను 40 మందికి ఇండ్లను అందజేశామని, మిగిలిన 12 మందికి త్వరలోనే పట్టాలు ఇస్తామన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.