హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గురువారం మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకొని ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం అల్లాహ్ మహమ్మద్ను చివరి ప్రవక్తగా నియమించారని ము స్లింలు భావిస్తారని, ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్-ఉన్-నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని పేర్కొన్నారు.
ప్రవక్త బోధనలైన శాంతి, కరుణ, ధార్మిక చింతన, దాతృత్వం, ఐకమత్యం, సర్వమానవ సమానత్వం ప్రపంచమంతా వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ముస్లింల సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అభ్యున్నతికి సర్కారు అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో గంగా జమున తెహజీబ్ పరిరక్షణకు తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.