CM KCR | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని సీఎం కేసీఆర్ప్రజలకు ఉద్బోధించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యం ఉన్నదని పేర్కొన్నారు.
దీపాల వెలుగులు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణ ఇస్తాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరిసంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.