హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతలు, విపత్తుల నిర్వహణలో అత్యంత కీలకంగా మారనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ప్రారంభానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో నిర్మించిన సీసీసీని ఆగస్టు 4న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని నిశితంగా పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ఒక్క పోలీసు శాఖకే కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడానికి వీలుగా దీనిని నిర్మించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సీసీసీ ఒక వార్రూంగా పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీసీసీ తుది దశ పనులను మంత్రి వేముల పరిశీలించారు. ప్రధాన ప్రవేశ ద్వారం, పోర్టికో, గ్రాండ్ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం పనులను పర్యవేక్షించారు.
అవసరమైతే మానవ వనరులను పెంచి మిగతా పనులు పూర్తిచేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. ప్రారంభ కార్యక్రమ అలంకరణ ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. సీసీసీని ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంగణమంతా కలియదిరిగి పరిశీలిస్తారని పేర్కొన్నారు. సీసీసీ ప్రారంభం తరువాత 14 వ అంతస్తు నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
చరిత్రాత్మకమైన ఈ నిర్మాణంలో తనను భాగస్వామిని చేసినందుకు ముఖ్యమంత్రికి మంత్రి వేముల కృతజ్ఞతలు తెలియజేశారు. దసరా పర్వదినం వరకు కొత్త నిర్మాణాలన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శ్రావణ మాసం మంచి రోజులు కావడంతో ఈ మేరకు నూతన నిర్మాణాలు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారని వెల్లడించారు.
సీఎం ఆదేశాల మేరకు అన్ని నిర్మాణాలు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మంత్రి ప్రశాంత్రెడ్డి వెంట డీజీపీ మహేందర్రెడ్డి, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, పోలీస్, ఆర్అండ్బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
జిల్లా పరిపాలన అంతా ఒకే చోట నుంచి నిర్వహించే విధంగా అన్ని జిల్లాల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో మరో ఆరు కలెక్టరేట్లు సిద్ధమయ్యాయి. శ్రావణమాసంలోనే నిర్మాణం పూర్తిచేసుకొన్న వాటిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటివరకు ఏడు కలెక్టరేట్లను సీఎం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బంజారాహిల్స్లో ఏడెకరాల విస్తీర్ణంలో రూ.585 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించారు. 20 అంతస్తులు, ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, సీఎస్, డీజీపీలకు ప్రత్యేక చాంబర్లు ఉన్నాయి. కంట్రోల్ రూమ్లో ప్రత్యేక డాటా సెంటర్ను ఏర్పాటుచేశారు.
రాష్ట్రంలో ఏ మూలన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఇక్కడి నుంచే నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇవ్వవచ్చు. పోలీస్ శాఖతోపాటు అన్ని శాఖలు సమన్వయం చేసుకొని పని చేయడానికి ఇక్కడ అవకాశమున్నది. ఒకేసారి వెయ్యిమంది పనిచేసేలా డెడికేటెడ్ వార్రూం ఇందులో ప్రత్యేక ఆకర్షణ. ఈ కంట్రోల్ సెంటర్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది.
దీని ద్వారా రాష్ట్రంలో మారుమూల పల్లెలో జరిగే ప్రతి సమాచారం 24 గంటలూ అందుతుంది. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి చర్యలు తీసుకోవడానికి ఆవకాశం ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదు. జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి వ్యవస్థ లేదు.
నూతన సచివాలయం, అమరుల స్మృతి వనం ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ దసరా రోజున ప్రారంభిస్తారని మంత్రి వేముల తెలిపారు. ఈ మేరకు ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతున్నదని చెప్పారు. ఇప్పటికే తమ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయడానికి వర్క్ ఫోర్స్ను కూడా పెంచారని వెల్లడించారు. నూతన సచివాలయం, అమరుల స్మృతివనం ప్రాజెక్టులు రెండూ సీఎం కేసీఆర్ మానస పుత్రికలన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పని చేస్తున్నామని వివరించారు.