హైదరాబాద్ : భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే మనం జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని మనం జాతీయ పార్టీ జెండాను పట్టుకోని పోతున్నామని కేసీఆర్ తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగం. దేశంలోని రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెల్ల కాలం పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణమన్నారు. వనరులుండీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేక దేశ ప్రజలు వంచించబడుతున్నారు. ఇది శోచనీయం. ఈ పద్దతి మారాలే. మనమే మార్చాలె. మన తెలంగాణను ఎట్లయితే మనం బాగుచేసుకున్నమో.. మన దేశాన్ని కూడా మనం బాగుచేసుకోవాలె. ఈ దేశంలో సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన సాగు భూమి వున్నది. పుష్కలంగా నీరువున్నది. కష్టపడి పనిచేసే ప్రజలున్నరు. ఇన్నీ వున్న తర్వాత మన దేశం ప్రపంచానికే అన్నం పెట్టాలె. పలు రకాలనై పంటలను పండించి ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించాలె. అది వదిలి మనమే పిజ్జాలు బర్గర్లు తినడం అంటే అవమానకరమని కేసీఆర్ పేర్కొన్నారు.
మనం ఛాలెంజ్గా తీసుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతోని నీల్లు ఇచ్చినట్టు భారత దేశమంతా ఇవ్వలేమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశమంతా ఇవ్వొచ్చు. మనం అదే చిత్తశుద్ధితో దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీళ్లను అందించాలన్నారు. ఇందుకు చైనాతో, పాకిస్తాన్తోనో, అమెరికాతోనో యుద్దం చేయాల్సిన అవసరం లేదు. కేవలం చిత్తశుద్ది ఉంటే చాలు…శుద్ది చేసిన మంచి నీళ్లను దేశమంతా అందించగలమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూర్చున్న వారంతా తెలంగాణ సాధించిన యోధులు.. వీరు అదే స్పూర్తితో దేశ సేవ చేయడానికి సిద్దంగా వున్నారని కేసీఆర్ తెలిపారు.