హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా దీనికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఖమ్మం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని పంజాబ్ సీఎం భగవంత్మాన్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నేతలు తిలకించారు.
కంటివెలుగు మొదటి దఫా కార్యక్రమానికి సంబంధించిన వివరాలతోపాటు రెండో దఫా ఏర్పాట్లను అక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా కంటివెలుగు విశేషాలను, శిబిరంలో కంటి పరీక్షలు చేసే విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అతిథులకు వివరించారు. రిజిస్ట్రేషన్ మొదలు కంటి పరీక్షలు పూర్తయ్యి, అద్దాలు అందజేసే వరకు ఏయే దశల్లో ఏమేం చేస్తారో సమగ్రంగా వివరించారు. ఈ వివరాలను ముగ్గురు సీఎంలు, ఇతర నేతలు ఆసక్తిగా విన్నారు. అంధత్వ రహిత తెలంగాణ కోసం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ వారికి చెప్పారు. మొదటి దశ విజయవంతం అయ్యిందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మొదటి దశలో వచ్చిన ఫలితాలను వారికి వివరించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, సీఎస్ శాంతికుమారి సైతం కంటి వెలుగు విశేషాలను అతిథులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు సీఎం కేసీఆర్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు మేలు చేసే మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.
మా దగ్గరా అమలు చేస్తాం
కంటి వెలుగు వివరాలను తెలుసుకొని అతిథులు ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో పేద, ధనిక, కులమతాల తేడా లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకొని అబ్బురపడ్డారు. ఉచితంగా మందులు అందజేయడంతోపాటు అవసరం ఉన్నవారికి ఉచితంగా కండ్లద్దాలు అందించడం, ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయిస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమష్టి కృషితో, వివిధ శాఖల సమన్వయంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారో ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంతో కంటి సమస్యలను ఎలా రూపుమాపవచ్చు? వాటి వల్ల ప్రజలకు కలిగే లబ్ధి ఏమిటి? ప్రభుత్వానికి ఎలా లాభం కలుగుతుంది వంటి వివరాలన్నీ తెలుసుకొన్నారు.
ఈ కార్యక్రమాన్ని తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బహిరంగ సభలో ప్రకటించారు. ‘సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మేం కంటి వెలుగును ప్రారంభించేందుకు వచ్చాం. కానీ.. 4 కోట్ల మంది ప్రజల్లో అవసరమైన వారికి కంటి పరీక్షలు చేయడం, అవసరమైన వారికి అద్దాలు ఇవ్వడం, కంటి ఆపరేషన్లు చేయడం అద్భుతం. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు. మేం ఢిల్లీలోనూ కంటివెలుగును అమలుచేస్తాం’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్లోనూ దీన్ని అమలు చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. కేరళ సీఎం పినరాయి విజయన్ సైతం తన ప్రసంగంలో కంటివెలుగు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం, అద్దాలు అందించడం అద్భుతమని కొనియాడారు. అఖిలేశ్ యాదవ్, డీ రాజా సైతం సీఎం కేసీఆర్ కంటివెలుగు రూపంలో గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
ఖమ్మంలో కంటి వెలుగు రెండోదశను ప్రారంభించిన అనంతరం వృద్ధురాలు జ్యోతికి కండ్లజోడు తొడుగుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సీఎంలు విజయన్, కేజ్రీవాల్, మాన్, జాతీయనేతలు అఖిలేశ్, డీ రాజా, మంత్రులు హరీశ్, పువ్వాడ, వేముల తదితరులు
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు
కంటివెలుగు రెండో విడతలో భాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్ష శిబిరాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. వీటిని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభిస్తారు. కార్యక్రమానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ ఆహ్వాన పత్రికలు అందాయి. స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శిబిరాల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా అధికారులు రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఆరుగురికి కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి సీఎం కేసీఆర్ సహా నేతలు స్వయంగా కండ్లద్దాలు తొడిగారు. ధరావత్ పిచ్చమ్మకు కేరళ సీఎం పినరాయి విజయన్, మందా అన్నపూర్ణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అనుబోతు రామనాథంకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కోలెం జ్యోతికి సీఎం కేసీఆర్, అమరనేని వెంకటేశ్వర్లుకు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, గౌసియా బేగంకు సీపీఐ ప్రధాన కార్యదరశి డీ రాజా కండ్లద్దాలు తొడిగారు. ఈ సందర్భంగా కండ్లద్దాలు తొడిగిన తర్వాత కంటి చూపు ఎలా ఉన్నదని నేతలు వారిని అడగ్గా, ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నదని సమాధానం ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నేతలు ఫొటోలు దిగారు. కంటివెలుగు బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ పథకాలు బాగున్నయ్
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చాలా బాగున్నయ్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నది. కంటి వెలుగు చాలా అద్భుతం. ఈ కార్యక్రమం ద్వారా నా కంటి చూపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. నాకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయాన కళ్లజోడు అందజేశారు. ఎంతో సంతోషంగా ఉంది.
–అన్నపూర్ణ, (ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతుల మీదుగా కళ్లజోడు అందుకున్న మహిళ)
నా జన్మ ధన్యమైంది
కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉంది. మొదటి దశలో మా గ్రామానికి చెందిన వారందరూ ఉపయోగించుకున్నరు. రెండో దశలో ప్రభుత్వం అవకాశం కల్పించినందుకు అదృష్టంగా భావిస్తున్న. కేరళ సీఎం పినరాయి విజయన్ స్వయంగా నాకు కళ్లజోడును తొడగడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ నా దగ్గరకు వచ్చి స్వయంగా కంటి సమస్యను అడిగి తెలుసుకోవడంతో నా జన్మ ధన్యమైంది.
–ధరావత్ పిచ్చమ్మ, జగ్యాతండా,
(కేరళ సీఎం పినరాయి విజయన్ చేతుల మీదుగా కళ్లజోడు అందుకున్న మహిళ)
సీఎంతో ఫొటో ఊహించలేదు
కంటి పరీక్షలు చేసిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కళ్ల జోళ్లు అందిస్తామని నూతనంగా ప్రారంభించే సమీకృత కలెక్టరేట్కు రమ్మని చెప్తే బుధవారం వచ్చాం. కళ్ల జోళ్ల కోసం వేచిచూస్తున్న మా వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరాయి విజయన్తో కలిసి వచ్చారు. నాకు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కళ్లజోడును స్వయంగా తొడిగారు. ఇది నేను కలలో కూడా ఊహించలేదు. కళ్లజోళ్లు పొందిన మాతో సీఎం కేసీఆర్ ఫొటో దిగారు. ఇది నా జీవితంలో మరిచిపోలేనిది. – అనుబోతు రామనాథం, వేపకుంట్ల,
సీఎం భగవంత్ సింగ్ మాన్ చేతుల మీదుగా కళ్లజోడు అందుకున్న వ్యక్తి)
పేదల దేవుడు కేసీఆర్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నాకు కళ్లజోడును స్వయంగా తొడిగారు. అనంతరం సీఎం కేసీఆర్ సారు మాతో కలిసి ఫొటో దిగారు. కంటి వెలుగుతో సీఎం కేసీఆర్ పేదలకు దేవుడయ్యాడు. సీఎం కేసీఆర్ స్వయంగా నా వద్దకు రావడం జీవితంలో నేను మర్చిపోలేని అనుభూతి. కేసీఆర్ సారు వచ్చినంక మంచి పథకాలు తీసుకొచ్చి పేదలకు మేలు చేస్తున్నడు.
– అమరనేని వెంకటేశ్వర్లు, వీ వెంకటాయపాలెం,
(అఖిలేశ్ యాదవ్ చేతుల మీదుగా కళ్లజోడు అందుకున్న వ్యక్తి)
కేసీఆర్ కళ్లజోళ్లు అందించడం సంతోషంగా ఉంది
కంటి వెలుగుతో మా లాంటి పేదలకు చాలా ఉపయోగం. ఇంత అద్భుతంగా ప్రభుత్వం కంటి వెలుగును రూపొందిస్తుందని అనుకోలేదు. మా కంటి సమస్యలు తెలుసుకొని మందులు రాసి, అద్దాలను ఉచితంగా ఇచ్చారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఇతర రాష్ర్టాల సీఎంల చేతుల మీదుగా మాకు కళ్లజోళ్లను అందించడం సంతోషంగా ఉంది. – గౌసియా బేగం,
(సీపీఐ జాతీయ నాయకులు డీ రాజా చేతుల మీదుగా కళ్లజోడు అందుకున్న మహిళ)