CM KCR | పదేళ్లు తండ్లాడి ఒక తొవ్వకు తెచ్చామని.. ఇప్పుడు ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నయని సీఎం కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పెట్టుబడికి సావుకార్ల వద్దకు పోవద్దని రైతుబంధు ప్రారంభించాం. రైతుబంధు అని ఎప్పుడన్నా విన్నమా కలలో.. గర్నమెంట్ రైతులకు డబ్బులు ఇస్తయని అనుకున్నమా? కాంగ్రెస్ పాలనలో ఏకానన్న ఇచ్చారా? బ్యాంకు అప్పులు కట్టకుంటే తలుపులు పీక్కపోయిన్రు కానీ.. రూపాయి ఇచ్చారా? రైతుబంధు పుట్టించిందే, ఇచ్చేదే బీఆర్ఎస్. ఎవరైనా అదృష్టం బాగాలేక చనిపోతే రైతుబీమా కింద రూ.5లక్షలు పంపిస్తున్నాం. అట్లనే రైతుపండించే పంట మొత్తం ప్రభుత్వమే కొంటున్నది. కనీస మద్దతు ధర చెల్లిస్తున్నది. అది కూడా మీ అకౌంట్లలో వచ్చి పడుతుంది’ అన్నారు.
‘మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వేస్ట్ అని మాట్లాడుతున్నడు. దాన్ని రూ.16వేలు రైతుబంధు రావాలంటే హర్షవర్ధన్ గెలవాలి. వేరే వాళ్లు గెలిస్తే ఏమవుతుంది ? ‘మందిమాటలు వట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లుకాలిపోయినట్లవుతుంది’. మాట్లాడుడు మస్త్ మాట్లాడుతరు. 50 ఏళ్లు ఉన్న నాడు ఏం చేయలేదు. పేదసాదలను పట్టించుకోలేదు. బొంబాయి పోయేట్టు చేశారు.. వాళ్లు ఎయిర్ కండీషన్లలో పన్నరు. ఇవాళ మళ్లీ మాట్లాడుతున్నరు. అందుకే మీరందరూ చర్చలు పెట్టాలి. 24గంటల కరెంటు వేస్ట్.. మూడు గంటల కరెంటు చాలాని పీసీసీ అధ్యక్షుడు అంటున్నడు. 24 గంటల కరెంటు ఉండాలంటే హర్షవర్ధన్రెడ్డిని గెలిపించాలి’ అని కోరారు.
‘మూడు గంటలు ఇస్తే ఎట్ల సరిపోతుంది? చాలదు. పీసీసీ అధ్యక్షుడు ఇదే జిల్లాలో పుట్టిండు. ఆయన చెబుతున్నడు. రైతులు పది హెచ్పీ మోటర్ పెట్టుకోవాలట ? ఆ మోటర్లు రైతులదగ్గర ఉంటయా? ఇవాళ తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. ఇన్ని లక్షల పంపుసెట్లు మారాలంటే.. రూ.30వేలకోట్లు కావాలి? మరి డబ్బులు ఎవడివ్వాలి ? కాంగ్రెస్ పార్టీ ఇస్తదా? దీని అర్థం ఏంటీ? పదేళ్లు తండ్లాడి ఒక తొవ్వకు తెచ్చిన తెలంగాణను ఎడారి చేయబోతున్నరు. ఇది ఓట్ల పంచాంగం కాదు.. తెలంగాణ బతుకుదెరువు పంచాంగం. ఢిల్లీ నుంచి వచ్చే కాంగ్రెస్, బీజేపోడికి మనపై ఎందుకు ప్రేముంటది. ఎవడో అన్నడ అన్నీ వంటలు చేయిన్రు. యాళ్లకు వచ్చి వడ్డన చేస్తాన్నడ? పదేళ్లు నానా కష్టాలుపడి పేదలు, రైతులను కాపాడి తెలంగాణను ఓ దరికి తీసుకువస్తే మళ్లీ ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నయ్.
ప్రధాని నరేంద్ర మోదీ మోటర్లకు మీటర్లు పెట్టాలె కేసీఆర్ అన్నడు. నేను సచ్చినా పెట్ట అన్నడు. పెట్టకపోతే సంవత్సరానికి రూ.5వేల బడ్జెట్ కోసేస్తా అన్నడు. రూ.25వేలకోట్లు తెలంగాణకు వచ్చే డబ్బులను నరేంద్ర మోదీ ఆపిండు. రైతుల బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెడుతలేవ్.. అందుకోసం నీ డబ్బు ఆపుతున్నానని ఆపిండు. మరి బీజేపీ ఏ మొఖం పెట్టుకొని ఓటు అడుతున్నది ? ఆలోచన చేయాలి. మీటర్ పెడితే ముక్కుపిండి బిల్లు వసూలు చేయాలి. డేంజర్ మాట ఇంకోటున్నది. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిపోయిండు కదా? భట్టి విక్రమార్క.. పీసీసీ ప్రెసిడెంట్ అందరూ చెబుతున్నరు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట. మరి రైతుబంధు, రైతుబీమా, పంట డబ్బులు ఎలా వస్తయ్’ అని ప్రశ్నించారు.
‘హర్షవర్ధన్రెడ్డి నిజాయితీగా ఉండే ఎమ్మెల్యే. కొన్ని కాలేజీలు పెట్టించిండు. మొన్ననే వంద పడకల ఆసుపత్రి పెట్టించిండు. పోయినసారి వచ్చినప్పుడు నాకు చెప్పి పట్టణానికి రూ.25కోట్లు జరిపించిండు. అవన్నీ జరుగుతయ్. మంచీచెడు మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరు? తెలంగాణ సాధించునోడు ఎవడు ? ప్రతి ఇంట్ల మంచినీళ్లు తెచ్చినోడు ఎవడు ? 24గంటల కరెంటు తెచ్చినోడు ఎవడు ? ఇవన్నీ అయ్యాక మేం వస్తామని బయలుదేరారు వీళ్లు.
ఆనాడు ఎండపెట్టి పండపెట్టి.. మళ్లీ ఇవాళ ఈ పనులు చేసేందుకు మోపయ్యారా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఓటు వేయాలి. ఎంత మానవీయ కోణంలో పని చేసిందో ఆలోచన చేయాలి. వచ్చే ఎన్నికల్లో హర్షవర్ధన్రెడ్డిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలి. నేను చెప్పే విషయాలపై ప్రజాక్షేత్రంలో చర్చ పెడితే ఆటోమేటిక్గా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిపోతాం. తమాషా చేయకుండా చర్చ పెట్టి.. మనం నిజాయితీగా చేసిన పనులు చెప్పి ప్రజలను ఓట్లు అడిగాలి. హర్షవర్ధన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే కొల్లాపూర్ అభివృద్ధికి నేను అండగా ఉంటా’నని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.