హైదరాబాద్: తెలంగాణ (Telangana) సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు (Administration reforms) గొప్ప చోదకశక్తిగా పనిచేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైందని, పర్యవేక్షణ సులభతరమైందని చెప్పారు. ప్రజలకు దూరాభారం తగ్గిందని, అధికారుల్లో, ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరిగిందని వెల్లడించారు. ఆయా జిల్లా కేంద్రాల అభివృద్ధి వేగవంతమైందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana Decade celebrations) సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పాలన పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా (New Districts) పునర్ వ్యవస్థీకరించుకున్నామన్నారు. కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
‘గతంలో కలెక్టరేట్ (District collectorate) భవనాలు అరకొర వసతులతో ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. కార్యాలయానికి వచ్చే ప్రజలు కూర్చొనేందుకు కుర్చీలుకూడా అందుబాటులో ఉండేవి కావు. కానీ, ప్రస్తుతం వివిధ జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలను నిర్మించుకుంటున్నాం. ఈ కార్యాలయ భవనాల స్థాయిలో ఏ రాష్ట్రంలో కలెక్టరేట్లు లేవని అందరూ ప్రశంసించడం మన ప్రగతి వైభవానికి నిదర్శనం. అవి ప్రజలకు శ్రద్ధాభక్తులతో సేవచేసే పవిత్ర దేవాలయాలుగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ను అందించుకున్నాం. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం. కరోనాతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా, గత పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ను ఇచ్చుకున్నాం. దీనిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా వర్తింపజేసి అమలు పరుచుకున్నాం. గ్రామీణ సమాజానికి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు చేస్తున్న సేవను గౌరవిస్తూ ప్రభుత్వం వారి వేతనాలను మూడు దఫాలుగా 325 శాతం పెంచింది.
2014లో అంగన్వాడీ టీచర్ల వేతనం కేవలం రూ.4,200. వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, అంగన్వాడీ హెల్పర్లకు రూ.7,800 చొప్పున దేశంలోకెల్లా అత్యధిక వేతనాలను చెల్లిస్తున్నాం.
పల్లెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమైనది. గర్భిణులు, బాలింతలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో వాళ్లు సాక్షాత్తూ అశ్వినీ దేవతలే. 2014లో వీరికి కేవలం రూ.1500 మాత్రమే లభించేది. నేడు తెలంగాణ ప్రభుత్వం వారికి గౌరవప్రదంగా రూ.9,750 అందిస్తున్నది.
నేడు దేశంలో అనేక విభాగాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్నది మన తెలంగాణ ఉద్యోగులేనని సగర్వంగా ప్రకటిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం తొలినుంచీ ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగే ప్రభుత్వమన్నది అందరికీ తెలిసిందే. పల్లెల్లో జరిగే ప్రతిపనిలోనూ వీఆర్ఏలు ముందుండి సేవలందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది వీఆర్ఏల సర్వీసుల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. అదేవిధంగా 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నది.
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎన్నో అవరోధాలను అధిగమించి భారీగా ఉద్యోగ నియామకాలు చేసుకుంటున్నాం. ఇందుకు లోకల్ కేడర్ల ఏర్పాటు, నియామకాలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ వ్యవస్థ కోసం రాజ్యాంగ ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించుకున్నాం. ఈ ఉత్తర్వుల వల్ల తెలంగాణలోని 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా ఉద్యోగ నియామకాలకు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60 శాతం నుంచి 80 శాతం వరకే లోకల్ రిజర్వేషన్లు ఉండేవి. కానీ ఇప్పడు అమలుచేస్తున్న నూతన నియామక విధానంలో అటెండరు స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయిదాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన మరో విజయం. ఒక వంక ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీలను పూరిస్తూనే, మరోవంక దీర్ఘకాలంగా కాంట్రాక్టు విధానంపై పనిచేస్తున్న సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించుకుంటున్నాం. ప్రైవేటు రంగంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించుకో గలుగుతున్నాం.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.