CM KCR | సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్ధాంతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఎన్నో సమస్యలున్నయ్. దేశంలో విపరీతమైన దేవుడు ఇచ్చిన ప్రకృతి సంపద ఉన్నది. నదుల్లో నీరు ఉన్నది. పుష్కలంగా కరెంటు ఉన్నది. ఏడేళ్ల కిందట మన బతుకు ఎట్ల ఉండే.
ఇవాళ కష్టపడ్డం. మన చేతుల్లో ఉంది కాబట్టి చేసుకున్నం. దాన్ని బతకనివ్వకుండా ప్రతి బోరుకు పెట్టాలే.. ముక్కు పిండి ప్రజల వద్ద పైసలు వసూలు చేయాలంటున్నటు ఈ మోదీ. ఇలానే అనేక విషయాల్లో సులభంగా పరిష్కరించే విషయాల్లో తాత్సారం చేస్తూ దేశాన్ని, ప్రజలను గాలికి వదిలేస్తున్నరు. తమకు ఇష్టమైన వ్యక్తులు, కోటీశ్వరులకు, షావుకార్లకు దేశ సంపదను దోచిపెడుతూ ప్రైవేటైజేషన్ పేరిట లక్షల కోట్ల ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నది. దుర్మార్గం పోవాలె’ అన్నారు.
‘ప్రజారాజ్యం, రైతుల రాజ్యం, దేశం కొంత పుంతలు తొక్కాలే. దేశ నదుల్లో ప్రవహించే నీరు సముద్రం పాలుకాకుండా రైతుల పంటపొలాల్లోకి రావాలి. తెలంగాణలో జరిగే ప్రయత్నమే భారతదేశమంతా జరగాలి. ఖచ్చితంగా తెలంగాణ జాతిగా భారత రాజకీయాలను ప్రభావితం చేయాలే. అవసరమైన సందర్భంలో ఏవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేశామో.. ఈ దేశంలో జరిగే మతపిచ్చి కలహాలను, కుట్రలను, విద్వేష రాజకీయాలను తప్పకుండా బద్దలుకొట్టాలే.
మహాత్ముడు సాధించిన ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్లాలి. పౌరులుగా మన కర్తవ్యం. పొరపాటు జరిగితే 58 సంవత్సరాలు గోసపడ్డం. మంచినీళ్లకు, కరెంటు, ఉద్యోగానికి వలసలు పోయాం. 20 ఎకరాలున్న రైతు హైదరాబాద్లో ఆటోలు నడిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బతుకు ఈ సమైక్య రాష్ట్రంలో బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్లు అయ్యింది.. రాష్ట్రం వస్తే బాగుపడుతాం అని చెప్పాం. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నం. పేదలకు అన్నం పెట్టుకుంటున్నం’ అని తెలిపారు.
‘ఈ రోజు గర్వంగా ఉన్నది. ఈ సభలో చీఫ్ సెక్రెటరీ పిలిస్తే.. మా చిన్నారి విద్యార్థులు బ్రహ్మాండమైన కేరింతలు కొట్టారు. గిరిజన గురుకులాల విద్యార్థులు 200 మంది డాక్టర్లు, వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన వారంతా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న. మీరు ఇంకా బంగారు బిడ్డలు, తెలంగాణ బిడ్డలుగా ఈ భారత జాతి ప్రతినిధులుగా ఎదగాలి. మీ గురించి ప్రభుత్వం ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంది. ఇంకా గురుకులాలను పెంచుతాం. గిరిజన ఆడ బిడ్డలు బాగా చదువుకోవాలి.
ఇంకా గిరిజన గురుకులాలు ఈ సంవత్సరం మంజూరు చేసుకునే ఆలోచన చేస్తున్నాం. బాలికలు, బాలుర కోసం ఏ ఒక్కరు చదువురాకుండా ఉండకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్. విద్యావంతులైన గిరిజన బిడ్డలు ఎక్కడ ఉన్నరు అంటే భారతదేశంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నరు అనే పేరు, కీర్తి, ప్రతిష్ట సాధించాలని హృదయపూర్వకంగా కోరుతున్న. నేను కోరేది ఒకటే. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఏవిధమైన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం జరుగుతుందో అందరూ కళ్లారా చూస్తున్నరు. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్ధాంతం’ అని సీఎం పేర్కొన్నారు.
‘సత్యవతి రాథోడ్ పోడు భూములపై ఏర్పాటు చేసిన కమిటీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చున్న మీటింగ్లో చెప్పాను. భూములు ఎంత వరకు ఉన్నాయో చూద్దాం. పోడు భూములు పంచిన తర్వాత.. అస్సలు భూములు లేకుండా ఉన్న గిరిజనులెవరో చూద్దాం. ఆ లిస్ట్ను తెప్పించాలని సీఎస్కు చెప్పా. ఆ లిస్ట్ ఒకసారి వస్తే ఏదైనా దళితబంధ.. ఇంటికి రూ.10లక్షలు ఇచ్చి ఆదుకున్నమో.. గిరిజనబంధు కూడా స్టార్ట్ చేయబోతున్నాం.
తప్పకుండా భూమిలేకుండా, భుక్తి లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజనబిడ్డలకు సైతం గిరిజనబంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నా. వెలుసుబాటు కూడా చూసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సాధించుకున్న స్వరాష్ట్రంలో కులం, జాతి, మతం అనే బేధం లేకుండా అందరం అన్నదమ్ముళ్లా మనం కలిసి జీవించాలే. ఒకరినొకరు ప్రేమించుకునే గొప్ప సమాజం నిర్మాణం కావాలే. దేశానికి వెలుగు దివిటీలను కావాలని ముందుకుసాగుతున్నాం’ అన్నారు.
‘కఠోరమైన దీక్ష, క్రమ శిక్షణ, అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు కదిలిపోతున్నం. మీ అందరి ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హామీలు, పాలసీలు విజయవంతమై పారిశ్రామికరంగం, ఐటీ రంగం, ఉద్యోగ కల్పన రంగం, వ్యవసాయరంగం దేశంలోనే అగ్రగామిగా ముందుకుపోతున్నం. 24గంటల కరెంటు అందరికీ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రంగా వెలుగొందుతున్నం. తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు.
దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు వారి సంకుచిత స్వార్థం కోసం చెలరేగొట్టే మత పిచ్చి మనకు అంటుకుంటే మనం ఎటుకాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తి, ఈ గడ్డ మట్టిలో పుట్టిన వ్యక్తిగా మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మళ్లీ కల్లోలానికి గురికావొద్దు.. గురికానివ్వొద్దు. విద్యావంతులు, మేథావులు, బుద్ధిజీవులు ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసి సమాజానికి కాపలాదారులుగా ఉండాలి’ అన్నారు.
‘ఈ సమాజాన్ని శాంతి, సుఖంతోని సర్వమానవ సౌభాతృత్వంతో బ్రహ్మాండంగా పురోగమించే దిశగా తీసుకోపోయేదాంట్లో నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల పక్షాన ఉంటా. తాడిత పీడిత ప్రజల కోసం ఈ దేశంలోని యావత్ అణచివేయబడ్డ జాతుల కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారిని సమున్నతంగా గౌరవించేవిధంగా తెలంగాణ ప్రధాన పరిపాలనమైనటువంటి సచివాలయానికి అంబేద్కర్ గారి పేరును పెట్టుకున్నాం.
ఈ రకంగా అన్నివర్గాలను గౌరవించుకుంటూ, అందరం కలిసి ఆనందంగా, సంతోషంగా, అన్ని సంస్కృతులు, పండుగలు, జాతర్లను గొప్పగా నిర్వహించుకుంటూ.. ఆడుతూ పాడుతూ ఈ సమాజం శాంతియుతంగా ముందుకు సాగాలె. అదే నా గుండెలనిండ ఉన్న కోరిక. దేవుడు ఇచ్చిన శక్తిని వినియోగించి మీ సేవలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి అభ్యుదయం గురించి పని చేస్తా. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన దీవించిన మీ అందరికి పేరుపేరునా ధాన్యవాదాలు.. రాం రాం.. జైహింద్.. జై తెలంగాణ’ అని నినదిస్తూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.