హైదరాబాద్ : రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ను అరికట్టేందుకు జిల్లాల్లో చేపట్టిన చర్యల నివేదికలతో అధికారులు హాజరయ్యారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ, అక్కడక్కడా తిరిగి మొదలవుతున్నట్టు సమాచారం అందుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన కఠినచర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి హోంమంత్రి మహముద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హోం, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు.