హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఎందులోనూ ఎవరూ సాటిరారని, పోటీలేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మానవీయకోణంలో, సామాజిక బాధ్యతతో చేపట్టినవేనని తెలిపారు. జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్నగర్ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్రంలో 8 ఏండ్లలో సాగిన ప్రయాణాన్ని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఆవిష్కరించారు. ఎన్నాళ్లు ఉద్యోగం చేశామన్నది ముఖ్యం కాదని, ఆ ఉద్యోగంలో ఏం సాధించామన్నదే ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలపై రాష్ట్రం సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ వివరించారు.
సంక్షేమంలో సాటిలేరెవ్వరు
8 ఏండ్ల క్రితం తెలంగాణకు కేవలం రూ.60వేల కోట్ల బడ్జెట్ ఉండేదని, ప్రస్తుతం అది రూ.2.5 లక్షల కోట్లకు చేరుకున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. 8 ఏండ్ల కిందట భయంకరమైన కరెంటు బాధలుపడిన తెలంగాణ.. విద్యుత్తు వినియోగంలో ప్రస్తుతం దేశానికే తలమానికంగా నిలువడం గర్వంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి, పోటీ ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా పనిచేయటానికి కారణం.. నిబద్ధతతో పనిచేసే ప్రజాప్రతినిధులు, వారితోపాటు రెండింతల అంకితభావంతో పనిచేసే ప్రభుత్వ సిబ్బందేనని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ‘శిరస్సువంచి నమస్కారం తెలియజేస్తున్నా..’అని అన్నారు.
చెట్లు కూడా బక్కపడతయా?
తెలంగాణ ఉద్యమకాలంలో పాలమూరు జిల్లాతో తన అనుభవాలను కేసీఆర్ నెమరేసుకున్నారు. ఆ రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్తో కలిసి తాను, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కారులో వస్తూ.. నవాబ్పేట మండలంలో ఫతేపూర్ అడవిని చూసి.. ‘ఏంది లక్ష్మారెడ్డీ.. మీ జిల్లాల చెట్లు కూడా బక్కగా అయిపోయినయా’ అన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి కుమారుడు సత్యం తొలినాళ్లలో జడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేస్తే .. తాను వరంగల్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సందర్భాన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ‘నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, కల్వకుర్తి.. పైన హెలికాప్టర్ నుంచి చూస్తే కండ్లళ్ల నీళ్లు తిరిగినయ్.. చాలా బాధపడ్డం’ అని ఆనాటి అనుభవాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో తాను అలంపూర్ నుంచి జోగులాంబ గద్వాల దాకా చేసిన పాదయాత్ర జ్ఞాపకాలను ఆయన నెమరువేసుకున్నారు. ఆనాటి పాలమూరు దయనీయ పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఒళ్లు జలదరిస్తుందని చెప్పారు.
నడిగడ్డ ప్రజల దుస్థితిపై ఏడ్చినం…
తెలంగాణ ఉద్యమ సమయంలో నడిగడ్డ ప్రజల పరిస్థితిని చూసి ఏడ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. అనేక వేదనలు, రోదనలు, గుండెలవిసే బాధలతోని బాధపడిన పాలమూరు జిల్లా బాగుపడుతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇటీవల తాను పాలమూరులో పర్యటించిన రెండు సందర్భాలనూ కేసీఆర్ గుర్తుచేశారు. పంటలు కోసే హార్వెస్టర్లు, కల్లాల్లో ధాన్యపురాసులు, రైతుల కండ్లల్లో సంతోషం చూసి తానెంతో మురిసిపోయానని అన్నారు. ఏ తెలంగాణ కావాలని కోరుకున్నమో, ఎందుకోసమైతే పోరాటం చేశామో.. ఆ ఫలితం ప్రస్తుతం కండ్లముందు కనిపిస్తున్నదని ఆయన ఆనందం వ్యక్తంచేశారు.
కంటివెలుగు రెండోదశను విజయవంతం చేయాలి
కంటివెలుగు ఓట్లకోసం తెచ్చిన పథకం కాదని, దాని వెనుక మానవీయ కోణం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలోని చిన్నగ్రామాన్ని దత్తత తీసుకుని బాగుచేద్దామని తాను బయల్దేరినప్పుడు తనకు కంటివెలుగు కార్యక్రమం చేపట్టాలన్న ఆలోచన వచ్చిందని తెలిపారు. ‘ఆ ఊరి వారికి విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత నేత్రపరీక్షా శిబిరం పెట్టినం. ఆ చిన్న ఊరిలోనే 127 మంది కంటిజబ్బులతో బాధపడుతున్నరు. ఇందులో 27మంది పిల్లలున్నరు. నేను హెల్త్ సెక్రటరీని పిలిచి సమాలోచన చేసిన. అట్లా లక్షలాదిమంది కోసం తీసుకువచ్చిందే కంటివెలుగు కార్యక్రమం’ అని కేసీఆర్ వివరించారు. వచ్చే నెల 18నుంచి రెండోదశ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దాని విజయవంతానికి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని ఆయన ఆదేశించారు.
అందరం కలిస్తేనే.. ప్రగతి అడుగులు
ఎప్పటికప్పుడు మేధోమథనం చేసుకుంటూ, ఆలోచనలను కలబోసుకుంటేనే ప్రగతి అడుగు ముందుకు పడుతుందని సీఎం కేసీఆర్ హితవు పలికారు. ఒక ముఖ్యమంత్రో, మంత్రో, ఎమ్మెల్యేనో, కలెక్టరో అనుకుంటే ఏమీ జరగదని, అందరూ టీమ్గా వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. అందుకు తెలంగాణ ప్రగతే నిదర్శనమన్నారు. శాపాలు పెట్టినవాళ్లు, దీవెనార్తి ఇచ్చినవాళ్లు, చిమ్మచీకట్లు కమ్ముకుంటయని భయపెట్టినవాళ్లు ఉన్నా.. తెలంగాణ ప్రయాణం మాత్రం ఆగలేదు. ఎక్కడినుంచో ఇక్కడిదాక వచ్చినమంటే అందుకు టీమ్వర్కే కారణం’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పాలమూరు జిల్లా అద్భుతంగా రూపాంతరం చెందుతున్నదని సంబురపడుతూనే.. ఇంకా చెందాల్సిన అవసరం ఉన్నదని గుర్తెరగాలని ఆయన సూచించారు.
మానవీయ కార్యాచరణకు ప్రతిరూపం కేసీఆర్ కిట్
టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పనిచేసినా మానవీయకోణంలో అమలు చేస్తుందని సీఎం చెప్పారు. ప్రతి కార్యక్రమం వెనక సుదీర్ఘ చర్చ, మథనం, ఒక ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథం ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్కిట్ వెనుక ఉన్న మానవీయ నేపథ్యాన్ని వివరించారు. గర్భవతులైన పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి.. వారు పనిచేయకుండా చూడటంతోపాటు వారు నష్టపోయే కూలీని సామాజిక బాధ్యతగా ప్రభుత్వమే భరించేలా తీసుకువచ్చిన పథకం కేసీఆర్ కిట్ అని సీఎం చెప్పారు. దీంతోపాటు దవాఖానల్లోనే ప్రసవాలు జరుగాలన్నది కూడా మరో ఉద్దేశమని తెలిపారు. మరోవైపు మెటర్నటీ వార్డులో సూపర్క్రిటికల్ వార్డులనూ ఏర్పాటు చేశామన్నారు. ఫ్రీగా మెడిసిన్ అందించటం, ప్రసవం చేయించటం, కేసీఆర్ కిట్ చేతిలో పెట్టి తల్లీబిడ్డను జాగ్రత్తగా అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దిగబెట్టి రావడం.. యావత్దేశంలో ఒక్క తెలంగాణలోనే జరుగుతున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.
త్వరలో మరిన్ని గురుకులాలు
పీవీ నర్సింహారావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గా ఉన్నకాలంలో రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుత ప్రగతికి దోహదం చేస్తాయని భావించినందునే.. నల్లగొండ జిల్లా సర్వేల్లో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్ నుంచే డీజీపీ మహేందర్రెడ్డి లాంటి ఎంతోమంది ఉన్నతపదవులు అలంకరించారని చెప్పారు. పీవీని ఆదర్శంగా తీసుకొని ఏ రాష్ట్రంలో లేనివిధంగా గురుకుల విద్యను అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వర్గాల బిడ్డల కోసం రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని గురుకులాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నదని తెలిపారు.
సామాజిక బాధ్యతతో ప్రభుత్వ కార్యక్రమాలు
ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మానవీయ దృక్పథం..సామాజిక దృక్పథంతో ప్రజలకు మేలు జరగాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతీ రూపాయి తిరిగి ప్రజల సేవలకు వెళ్లాలన్నదే తమ అభిమతమని చెప్పారు. చాలా మేధోమథనం చేసి కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. లో పాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ముందుకు పోవాలని ఆయన అధికారులకు సూచించారు. సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని, మానవజాతి భూమ్మీద ఉన్నన్ని రోజులు సంస్కరణలు ఉంటాయని చెప్పారు. ఒక్క సం స్కరణతో లక్ష్యం పూర్తికాదని, ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.
చేసిన మంచి పని జీవితాంతం గుర్తుండిపోవాలె: సీఎం
సాధించిన ప్రగతికితోడు ఇంకా అద్భుతమైన అభివృద్ధిని సాధించాల్సి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే. వెయ్యేండ్లు బతకడానికి ఎవరూ రాలేదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్నిబట్టి ఒకరు అటెండర్, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కావచ్చు. ఒకరు చీఫ్ సెక్రటరీయో, మంత్రో, ముఖ్యమంత్రో కావచ్చు. ఇవి శాశ్వతం కాదు. అధికారం అనేది పొద్దాక ఉండదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సర్వీసులో ఉన్నప్పుడు ఏమి చేశామనేదే లక్షల కోట్లకు సమానమైన సంతృప్తిని ఇస్తుందని, ఉద్యోగికి మిగిలేది అదే సంతృప్తి అని చెప్పారు.
రాష్ట్ర జీడీపీ 11.54 లక్షల కోట్లు: సీఎస్ సోమేశ్
రాష్ట్ర జీడీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి నేడు రూ.11.54 లక్షల కోట్లకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఏ ఒక్క రంగాన్నీ నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహబూబ్నగర్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే చెందేలా చేశామని, 85 వేల ఉద్యోగాలకు విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని వివరించారు.