CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి ప్రజా నాయకుడు బసవేశ్వరుని జయంతిని పురసరించుకొని వీరశైవ లింగాయత్లు, లింగ బలిజలు సహా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. బసవేశ్వరుడి సేవలు, బోధనలను స్మరించుకొన్నారు. సమాజంలోని మత ఛాందసాన్ని ఖండించి, సాంఘిక దురాచారాల మీద పోరాటం చేయడమే కాకుండా, వర్ణ, కుల, లింగ వివక్ష లేని సమాజం కోసం 900 ఏండ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడు అని కొనియాడారు.
‘అనుభవ మంటపం’ వ్యవస్థను ఏర్పాటు చేసి, అన్ని కులాలకు అందులో ప్రాతినిధ్యం కల్పించి, పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలనకు బీజాలు వేశారని తెలిపారు. బసవేశ్వరుని జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నదని చెప్పారు. బసవేశ్వరుని స్ఫూర్తిని రేపటి తరాలకు అందించేందుకు ఆయన కాంస్య విగ్రహా న్ని ట్యాంక్బండ్పై నెలకొల్పామని గుర్తు చేశా రు. హైదరాబాద్ కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి 10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా మనుషులంతా ఒకటేననే బసవేశ్వరుని సమతా తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని వెల్లడించారు. దళిత, బహుజన, గిరిజన వర్గాలు, మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ బసవేశ్వరుని ఆశయాలను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.