Crop Loan | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ చెప్పారంటే.. చేస్తారంతే..! కొంచెం ఆలస్యమవుతుండొచ్చుగానీ చెప్పిన పని, ఇచ్చిన హామీ నెరవేర్చడం మాత్రం ఖాయం’.. ఇదీ సీఎం కేసీఆర్ను లోతుగా చదివిన వాళ్లు చెప్పే మాట. ఇందుకు ఇప్పటివరకు చాలా ఉదాహరణలు చూశాం. తాజాగా మరో ఉదాహరణ మన ముందుకొచ్చింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ తు.చ తప్పకుండా నెరవేర్చారు. 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు ఇప్పటికే రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును సీఎం ఆదేశించారు. రుణాల చక్రబంధంలో ఇరుక్కొని రైతులు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. అందుకే రైతులను రుణ విముక్తి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పంట రుణాల మాఫీని అమలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లోనే రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. దీంతో సీఎం కేసీఆర్ తమకు ఇంకా మంచి చేస్తారని నమ్మిన రైతులు, ప్రజలు మరోసారి ఆయనకు పట్టంకట్టారు.
ఆ నమ్మకాన్ని సీఎం కేసీఆర్ కూడా వమ్ము చేయలేదు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా 2018 ఎన్నికల సమయంలోనూ మరోసారి రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.36 వేలలోపు గల రైతుల రుణాలను మాఫీ చేశారు. 5.42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 1,207.37 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిం ది. మిగిలిన రుణాలకు సంబంధించి మాఫీ చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈసారి సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. తొలి రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజా రుణమాఫీని కూడా కలిపితే ఇది సుమారు రూ.36 వేల కోట్లకు చేరనున్నది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. రైతులు బ్యాంకుల్లో తీసుకొన్న రూ. లక్షలోపు పంట రుణాలు పూర్తిగా మాఫీ కానున్నాయి.
ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాలకుతోడు కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలవల్ల రుణమాఫీలో కొంత జాప్యం జరిగింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు వంటి పథకాలను చిత్తశుద్ధితో నిరాటంకంగా కొనసాగిస్తూనే వస్తున్నం. ఎన్ని కష్టాలొచ్చినా, ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని విస్మరించే ప్రసక్తేలేదు.
– ముఖ్యమంత్రి కేసీఆర్
రైతులోకం హర్షాతిరేకం
రుణమాఫీ ప్రకటనతో రైతులోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. తమ పంట రుణాలు మాఫీ అవుతుండటంతో సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఇన్ని రోజుల పాటు ప్రతిపక్షాలు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేశాయి. దీంతో రైతులు కొంత అయోమయంలో పడిపోయారు. కానీ ప్రతిపక్షాల ఆరోపణలను, రైతుల అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తమను రుణవిముక్తులను చేస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు చెప్తున్నారు.
రైతు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్
స్వయంగా రైతుబిడ్డ అయిన సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలు, కన్నీళ్లు బాగా తెలుసు. కాబట్టి తన పాలనలో రైతుల కంట కన్నీరు రావొద్దనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం రైతుల సంక్షేమమేనని అనేకమార్లు చెప్పారు. చెప్పడమే కాదు..వాటిని ఆచరణలో పెట్టారు. వ్యవసాయరంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఒకప్పుడు పొట్ట చేతపట్టుకొని వలసపోయిన మన రైతన్న, నేడు సగర్వంగా వ్యవసాయం చేసుకొంటూ బతుకుతున్నాడు. పుష్కలమైన పంటల ఉత్పత్తితో రైతుల్లో ఆర్థిక స్థోమత పెరిగింది.