హైదరాబాద్ : ప్రముఖ జాతీయ వ్యాపార వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మృతిపై సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి, దేశ వ్యాపార వాణిజ్య రంగానికి రాహుల్ బజాజ్ చేసిన కృషి గొప్పదన్నారు. బజాజ్ స్కూటర్ వంటి ఉత్పత్తులు దేశ ప్రజాజీవనంలో భాగస్వామ్యం అయ్యాయన్నారు. ‘‘హమారా బజాజ్’ అనేది వ్యాపార వాణిజ్య నినాదమే అయినప్పటికీ, అది భారత జాతిని, ఉత్పత్తి రంగంలో స్వీయ అస్తిత్వ విధానం’ దిశగా చైతన్య పరిచిందని సీఎం అన్నారు. రాహుల్ బజాజ్ సామాజిక బాధ్యత కలిగిన జాతీయవాద వ్యాపారవేత్తగా సీఎం పేర్కొన్నారు. రాహుల్ బజాజ్ మరణం, దేశీయ పారిశ్రామికరంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.