హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరివెళ్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత వైఖరి తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులతో సీఎం కేసీఆర్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.