Telangana | 2014కు ముందు గడిగడికి కరెంటు పోయే దినాలు. పరిశ్రమలకు పవర్హాలిడేలు.. కార్మికులకు చుట్టీలు.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు.. తెగి వేలాడే విద్యుత్తు వైర్లు.. ఎండిపోయిన పొలాలు.. ఉరికొయ్యకు ఊగులాడిన దేహాలు
మరి ఇప్పుడు.. రైతులకు కోతల్లేని ఉచిత కరెంటు.. పండించుకున్నన్ని పంటలు 24/7 నడుస్తున్న పరిశ్రమలు.. ప్రతి ఇంటా నిత్యదీపావళి వెలుగులు
కటిక చీకట్లను చీల్చి.. 24 గంటలు నిరంతరాయంగా కరెంటునిచ్చి.. దేశానికే వెలుగులదివ్వెగా తెలంగాణను మార్చిందెవరు? ఇంకెవరూ.. కేసీఆర్ కాదా?!
చీకట్లలో మగ్గుతారంటూ శాపనార్థాలు పెట్టిన కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంత రాయ విద్యుత్తును అందిస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించింది తెలంగాణ. 2014 జూన్ 2 నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో చిమ్మ చీకట్లు. పంటలు పండక, అప్పుల బాధతో రైతుల చావులు, ఆత్మహత్యలు అప్పట్లో సర్వసాధారణం. కోతలు లేవు. పవర్ హాలిడేలు అసలే లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అప్పట్లో కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త..!
తొలి సమీక్షే విద్యుత్తు అంశంపై
తెలంగాణ ఏర్పడ్డ వెంటనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై దృష్టి సారించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్రావును నియమిస్తూ జీవో నెం. 1 విడుదల చేశారు. మొదటి సమీక్షా సమావేశం కూడా విద్యుత్తుపైనే. ట్రాన్స్మిషన్ నష్టాలను 2.52 శాతానికి (2022-23లో) తగ్గించగలిగారు. డిస్కంల నష్టాలను గణనీయంగా తగ్గించారు. 24 గంటల విద్యుత్తును మొదటగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచారు. అవసరాలకు అనుగుణంగా స్వల్పకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఎక్స్ఛేంజీ నుంచి విద్యుత్తును కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రం ఏర్పడిన కేవలం ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పరిశ్రమల రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించగలిగారు. వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్తును అందించారు. విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ.40,470 కోట్లను ఖర్చు పెట్టారు. ఇక 2018 జనవరి ఒకటి నుంచి దేశం యావత్తూ ఆశ్చర్యపడేలా వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా, నాణ్యమైన పూర్తి ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు దేశంలోనే అత్యంత నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తు 24 గంటలపాటు ఎక్కడ ఉంటుందంటే.. ఒక్క తెలంగాణ తప్పితే మరే రాష్ట్రం కనుచూపు మేరలో కనపడదు.
విభిన్న భౌగోళిక పరిస్థితులు..
తెలంగాణలో భౌగోళిక విభిన్నత కారణంగా సాగునీరు అనేది కాలువల ద్వారా అందించడం కష్టం. ఇటు కృష్ణా.. అటు గోదావరి రెండు నదుల కంటే తెలంగాణ భూభాగం ఎత్తులో ఉంటుంది. అందుకే రాష్ట్రంలో వ్యవసాయం బోర్లు, బావులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ బోర్లు, బావుల్లోంచి నీటిని తోడుకునేందుకు విద్యుత్తు అవసరం. కానీ సొంత రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఉమ్మడి ప్రభుత్వాలు వ్యవసాయానికి విద్యుత్తును అందించడంపై దృష్టి సారించలేక పోయాయి. దీంతో తెలంగాణ రైతులు తమ పంటలు సాగు చేసుకునేందుకు.. తమ అదృష్టాన్ని, వరుణ దేవున్ని నమ్ముకునేవారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. అలా మార్చడానికి ఉపయోగపడ్డది 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్తు సరఫరా పథకం.
వేల కోట్లతో వ్యవస్థల బలోపేతం..
‘రైతులకు ఎంత చేసినా తక్కువే’ అని సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్రావు ఎప్పుడూ చెబుతుండే మాట. నిజానికి సాగునీరు, పెట్టుబడి, కావాల్సి నంత విద్యుత్తు అందుబాటులో ఉంటే.. రైతులు బంగారం పండిస్తారనేది సీఎం కేసీఆర్కు అపారమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని సాధించేందుకే రూ.వేల కోట్లను వెచ్చించారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించడానికి కావాల్సిన మౌలిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేశారు. ఇందుకు సాంకేతిక అంశాలపైనా ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావుతోపాటు విద్యుత్తు రంగ నిపుణులతోనూ సీఎం చర్చించే వారు. ట్రాన్స్కోలో అతి ముఖ్యమైన 400 కేవీ సబ్ స్టేషన్లను, 220 కేవీ సబ్స్టేషన్లను గణనీయంగా పెంచారు. మొత్తం ఈహెచ్టీ లైన్ల పొడవును భారీగా పెంచారు. డిస్కంల పరిధిలో 33 కేవీ సబ్స్టేషన్లను, ఎల్టీ లైన్ల పొడవును పెంచారు. రాష్ట్రం రాకముందు ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్ శాతం 30 ఉంటే.. దీనిని 7 శాతానికి తగ్గించగలిగారు. లో ఓల్టేజీని అరికట్టారు. ఇందుకోసం సుమారు 4.05 లక్షల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను అదనంగా చేర్చారు. పీటీఆర్ల సంఖ్యను కూడా 3272 నుంచి 5694కు పెంచడంతో.. ఫెయిల్యూర్ శాతం గణనీయంగా తగ్గింది.
వ్యవసాయంపై కేసీఆర్కు ఎంతటి ప్రేమంటే.. ఆయన మాటల్లోనే..
☞ రైతులకు ఎంత చేసినా తక్కువే. అయినా.. నాకు అర్థంగాక అడుగుతా? దేశానికి బువ్వ పెట్టే రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే తప్పేంటి? అందుబాటులో విద్యుత్తు ఉంటేనే గదా.. రైతన్న నిశ్చింతగా వినూత్నమైన పం టల వైపు దృష్టి సారిస్తడు.
☞ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. వ్యవసాయానికి విద్యుత్తు విషయంలో రైతులు అనేక బాధలు ఎదు ర్కొంటున్రు. ముఖ్యంగా, 100 కేవీఏ, 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ల కోసం పైరవీలు చేయాల్సి వచ్చేది. మంత్రులతో సిఫారసు చేసే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాలి. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను తక్షణం మార్చేలా వ్యవస్థను రూపొందిం చాలి. అప్పుడే రైతు బాగుపడ్తడు.
☞ సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చు కన్నా.. తద్వారా వచ్చే పంటల దిగుబడితో రాష్ర్టానికి, ప్రజలకు వచ్చే రాబడి చాలా ఎక్కువ. ఇది అందరూ గమనించాలి.
☞ సాగుకు ఉచిత విద్యుత్తును అందివ్వడ మనేది ప్రభుత్వాల బాధ్యత. పూర్తి ఉచిత విద్యుత్తు కోసం రైతులకు పెట్టే ఖర్చును ప్రభుత్వం ఎప్పుడూ భారంగా పరిగణిం చొద్దు.
వ్యవసాయానికి మూడో వంతు..
రాష్ట్రంలో వినియోగమయ్యే విద్యుత్తులో దాదాపు 33 శాతం.. అంటే, మూడో వంతు విద్యుత్తు వ్యవసాయా నికే వినియోగిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేశారు. వానకాలంలో కంటే.. యాసంగిలో వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. యాసం గిలో పంటలు చేతికొచ్చేంత వరకు విద్యుత్తు వినియో గం ఎక్కువగా ఉంటుంది. డిస్కంల వారీగా కాస్త హెచ్చుతగ్గులు ఉన్నప్ప టికీ.. మొత్తంగా రాష్ట్ర వినియోగంలో 33 శాతం విద్యుత్తు వ్యవసాయ రంగం వినియోగించుకుంటుందనే చెప్పవచ్చు.
పేదలకు రాయితీ.. డిస్కంలకు సబ్సిడీ
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు, అలాగే వ్యవసాయానికి పూర్తి ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు కోసం 2023-24లో రూ. 11,500 కోట్లను సబ్సిడీగా అందించింది. దీనికి తోడుగా.. డిస్కంలకు రూ. 9,161 కోట్లను అదనపు సబ్సిడీ (2016-17 నుంచి 2021-22 వరకు)గా అందించింది. అలాగే ఉదయ్ స్కీం కింద తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని డిస్కంలకు సంబంధించిన రూ. 8,293 కోట్ల రుణాలను టేకోవర్ చేసింది.
తలసరి విద్యుత్తు వినియోగం..
ఏ రాష్ట్రం అయినా అభివృద్ది చెందుతున్నది అనడానికి కొలమానంగా తలసరి విద్యుత్తు వినియోగాన్ని చూస్తారు. రాష్ట్రం వచ్చేనాటికి ఇది 1,196 యూనిట్లే. 2021-22 సంవత్సరంలో 2,126 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగం నమోదయ్యింది. అదే సమయంలో దేశంలో సగటు తలసరి విద్యుత్తు వినియోగం కేవలం 1,255 యూనిట్లు కావడం గమనార్హం. అంటే దేశ సగటు కంటే.. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 69.40 శాతం అధికం అన్నమాట.
ఉద్యోగుల రెగ్యులరైజేషన్
దేశంలోనే ఏ రాష్ట్రం కూడా చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి.. వారిని ఆర్టిజన్లు అనే పేరుతో రెగ్యులరైజ్ చేశారు. ఇలా ట్రాన్స్కో, జెన్కో, రెండు డిస్కంలలో కలిపి మొత్తం 22,722 మందిని రెగ్యులరైజ్ చేశారు. ఇది దేశంలోని విద్యుత్తు రంగ చరిత్రలోనే రికార్డుగా చెప్పవచ్చు.
పీక్ డిమాండ్.. గరిష్ఠ వినియోగం..
రాష్ట్రం ఏర్పడిన సమయంలో 5,661 మెగావాట్లు (6.6.2014) గరిష్ఠ డిమాండ్ నమోదయ్యింది. అది కాస్తా 15,497 మెగావాట్లు (30.3.2023)కు చేరుకుంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గరిష్ఠ డిమాండ్ నమోదయ్యింది కేవలం 13,162 మెగావాట్లు (23.3.2014) మాత్రమే. అంటే ఉమ్మడి రాష్ట్రం కంటే ఇప్పుడు తెలంగాణలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. అలాగే విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ దూసుకెళ్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 128 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం (6.6.2014) జరగ్గా.. 14.3.2023 నాడు ఏకంగా 297.89 మిలియన్ యూనిట్ల విద్యుతు వినియోగం జరిగింది. ఇదీ ఒక రికార్డు.
స్థాపిత సామర్థ్యం పెంపు..
రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లే. ఈ తొమ్మిదేండ్లలో.. కేటీపీపీ నుంచి 600 మెగావాట్లు, 240 మెగావాట్లు లోయర్ జూరాల, 120 మెగావాట్లు పులిచింతల, 800 మెగావాట్లు కేటీపీఎస్ (స్టేజ్-7), 1080 మెగావాట్లు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, 1200 మెగావాట్లు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, 1000 మెగావాట్లు ఛత్తీస్గఢ్ నుంచి, 6106 మెగావాట్లు సౌర విద్యుత్తు, 128 మెగావాట్లు పవన విద్యుత్తుతో నేడు 19,464 మెగావాట్లకు (అక్టోబర్ 1, 2023 నాటికి) స్థాపిత సామర్థ్యం చేరుకుంది. మరో 8,485 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. దామరచెర్లలోని 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ప్రతిష్టాత్మకం. ఎన్టీపీసీ రామగుండంలో 1600 మెగావాట్లు ఉన్నాయి.
… ఎక్కల్దేవి శ్రీనివాస్