ధర్మారం, నవంబర్ 17 : సీఎం కేసీఆర్ రైతులకు శ్రీరామ రక్ష అని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్, పత్తిపాక గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. పత్తిపాక సింగిల్ విండో ఆధ్వర్యంలో మల్లాపూర్లో నాబార్డు నిధులు రూ.25 లక్షలతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 68 మంది దళిత మహిళలకు కుట్టుమెషిన్లు పంపిణీ చేశారు. పత్తిపాకలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి, ఎస్సీ కాలనీ దళితులతో మాటామంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లాపూర్లో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్షకట్టి ఏపీలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తే, తెలంగాణలో ఏర్పాటు చేయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి రైతులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దొడ్డు వడ్లు కొనేది లేదని ప్రధాని మోదీ సర్కార్ మొండికేస్తే రాష్ట్ర రైతులు నష్టపోవద్దని సీఎం కేసీఆర్ గతేడాది రెండు సీజన్లలో కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగు నీటి గోసను తీర్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు.