హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. ఆమె ఆరోగ్య సమస్యలతో సతమతం అయితే కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతల కారణంగానో, డబ్బు ఖర్చవుతుందనో, ఎవరికీ చెప్పుకోలేకనో, సరైన అవగాహన లేకనో.. చాలామంది మహిళలు తమ అనారోగ్య సమస్యలను బయటపెట్టుకోరు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు నేరుగా దవాఖానకు వెళ్లి వైద్యులను సంప్రదించేవారు చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, వారు స్వేచ్ఛగా తమ ఇబ్బందులను వైద్యులకు చెప్పుకునేలా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకే వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 100 ఉమెన్ స్పెషల్ క్లినిక్స్ను ఏర్పాటుచేశారు. ‘మహిళ ఆరోగ్యం-ఇంటి సౌభాగ్యం’ అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే 19 వేల మందికిపైగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దశలవారీగా ఈ దవాఖానల సంఖ్యను 1,200కు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కరీంనగర్లో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లోని 100 కేంద్రాల్లో ఈ నెల 14 నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తర్వాత ఈ నెల 21న, 28న ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. మొదటి వారంతో పోల్చితే మూడో వారానికి ఓపీ 70% పెరిగింది. మొదటిరోజు 4,793 మంది పరీక్షలు చేయించుకోగా, ఈ నెల 28న 7,965 మందికి నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో సగటున 80 మంది పరీక్షలు చేయించుకున్నారు.
ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మహిళలను సిబ్బంది ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారికి 8 రకాల ప్రధాన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, రక్తహీనత వంటి ప్రాథమిక పరీక్షలు చేస్తున్నారు. దీంతోపాటు వారు చెప్పిన లక్షణాల ఆధారంగా ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, నెలసరి సమస్యలు వంటివి స్రీనింగ్ చేస్తున్నారు. అధిక లేదా తక్కువ బరువు, సుఖ వ్యాధులు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలు, అయోడిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ లోప నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్స్మియర్ వంటి యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఇలా మూడు మంగళవారాల్లో కలిపి 10 వేలకుపైగా నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. మొదటివారం 2,723 నమూనాలను సేకరించగా, రెండో వారం 2,792, మూడోవారం 4,727 శాంపిళ్లను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్కు పంపించారు. మూడు వారాల్లో కలిపి సుమారు వెయ్యి మందిని మెరుగైన వైద్యం కోసం పై దవాఖానలకు రెఫర్ చేశారు.
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అమలుచేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఉమెన్ స్పెషల్ క్లినిక్లకు ఆదరణ పెరుగుతున్నది. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం, మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. నూతనంగా మహిళా జర్నలిస్టులకు కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం.
-వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు