యాదాద్రి ఆలయం అత్యద్భుతం
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ భేష్
చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రశంస
యాదాద్రి, ఏప్రిల్ 12 : యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కొనియాడారు. శ్రీకృష్ణ దేవరాయలు మాదిరిగా సీఎం కేసీఆర్ యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన్నడూ జరుగలేదన్నారు. కేసీఆర్ చొరవతోనే ఇది సాధ్యమైందని, ఆయన యాదాద్రి ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. మంగళవారం పీఠాధిపతి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి స్వరూపానందేంద్ర సరస్వతి స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకొన్నారు.
త్రితల రాజగోపురం వద్ద వారికి ఆలయ ప్రధానార్చక బృందం, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువులను దర్శించుకొని పూజలు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ముఖ మండపంలో స్వర్ణమయంగా రూపొందించిన ధ్వజస్తంభానికి నమస్కరించారు. ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం యాదాద్రి కొండ కింద తులసీ కాటేజీ వద్ద స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాలు ఎవరి సొత్తూ కాదని, ఏ ఆలయాన్నీ శైవానికో, వైష్ణవానికో పరిమితం చేయొద్దని సూచించారు. ఆలయాలు సనాతన ధర్మానికి చెందిన సంపదగా పేర్కొన్నారు. ఆదిశంకరాచార్యుల వారి సంప్రదాయ పీఠాలకు హైందవ ధర్మమే ముఖ్యమని చెప్పారు. ఆదిశంకరాచార్యులు రచించిన శ్లోకాలే యాదాద్రిలోనూ అనుసరిస్తున్నారని గుర్తుచేశారు.