మంచిర్యాల టౌన్, జూన్ 9: ధరణి కావాలా? వద్దా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించగానే లక్షలాది జనం ముక్త కంఠంతో కావాలి..కావాలంటూ హోరెత్తించారు. ధరణి కావాలనుకునే వారు చేతులు లేపండి అనగానే లక్షలాది సభికులు ఒక్కసారిగా చేతులు పైకి లేపారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మంచిర్యాల జిల్లాతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. సింగరేణి కార్మికులు తండోపతండాలుగా తరలివచ్చారు. కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ సభా వేదిక మీదకు చేరుకోగానే జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సీఎం కేసీఆర్ అభివాదం చేస్తుంటే జనం కేరింతలు కొట్టారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించినప్పుడు, దివ్యాంగుల పింఛన్ పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటన చేయగానే చప్పట్లతో సభ మార్మోగిపోయింది.
సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించాక, రూ.55 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. అంతకుముందు సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఇతర అధికారులు సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. కలెక్టరేట్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గుమ్మడికాయ కొట్టగా, సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
లిఫ్ట్ ఇరిగేషన్ శిలాఫలకం ఆవిష్కరణ
చెన్నూర్ నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,658 కోట్లతో నిర్మించనున్న చెన్నూర్ ఎత్తిపోతల పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.83 కోట్లతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పర్ధాన్పల్లి ఎత్తిపోతల పథకానికి, రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, 300 పడకల అనుబంధ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.164 కోట్లతో మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులకు కూడా కలెక్టరేట్ ప్రాంగణం నుంచే శంకుస్థాపన చేశారు. వీటితోపాటు మందమర్రి శివారులో రూ.500 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు.