హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేశంలో తప్పు జరుగుతున్నదని, ప్రజలంతా మౌనం వీడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ తరఫున శనివారం జలవిహార్లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే సభ్యులంతా ఆత్మ ప్రబోధానుసారం ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేయాలి. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేత. ఆయన గెలుపుతో దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. యశ్వంత్ సిన్హా తన కెరీర్ను అడ్వకేట్గా ప్రారంభించారు. తర్వాత ఐఏఎస్ అధికారిగా సేవ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి, దేశ ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనితీరుకు అంతర్జాతీయంగా ప్యారిస్లో పురస్కారం పొందారు. అలాంటి గొప్ప నేతకు స్వాగతం పలకడం గర్వంగా ఉన్నది. మనది ప్రజాస్వామ్య దేశం.
గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో వీవీ గిరి పోటీ చేశారు. ఆ సమయంలో ‘ఆత్మప్రభోద్ సే ఓట్ దీజీయే’ అనే నినాదం వచ్చింది. ఈ నినాదం అనుసారంగానే వీవీ గిరి ఆ ఎన్నికల్లో రాష్ట్రపతిగా గెలిచారు. ఈ రోజు దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకోవాలన్నది ఆత్మసాక్షితో ఆలోచించి, ఆత్మపరిశీలనను అనుసరించి యశ్వంత్సిన్హాను బలపర్చాలని కోరుతున్నా.
యశ్వంత్ గారు తప్పక గెలవాలని కోరుకుంటున్నా. మీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే వ్యక్తిగతంగా మీతోపాటు దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. దేశంలో చాలా తప్పుడు పద్ధతిలో అనేక అంశాలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో దేశం మౌనంగా ఉండకూడదు. మన గొంతు వినిపించాలి. అంతా ఏకీకృతం కావాలి. గొప్పగా దేశ స్థితిని మార్చే క్వాలిటేటివ్ చేంజ్ రావాలి.
ప్రధాని మోదీ తనను మించిన తెలివైనవాడు ఇంకెవరూ లేరని అనుకుంటున్నారు. గొంతు చించుకొని మన గురించి మాట్లాడబోతున్నారు. మోదీని నేనొక్కటే అడగదల్చుకొన్నా.. ‘మీరు ఎలాగైతే ప్రతిపక్ష నాయకులపై తప్పుడు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారో.. అదేవిధంగా మీరు హైదరాబాద్ సభలో మాట్లాడనున్నారు కాబట్టి, మీ ప్రసంగంలో మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇది నా ఒక్కడిది కాదు.. యావత్తు దేశం డిమాండ్. ప్రధానిగా మీరు తొలిసారి ఎన్నికైనప్పుడు ప్రజలకు ఎన్నో ప్రమాణాలు చేశారు. వాటిలో ఒక్కటైనా పూర్తి చేశారా?. ఒకవేళ ఏదైనా పూర్తి చేసి ఉంటే అదేంటో తెలుసుకోవాలనుకొంటున్నాం. మేం టార్చిలైట్తో వెతికినా ఒక్కటీ కనిపించటం లేదు.
దేశంలో రైతులకు ఎంతో చరిత్ర ఉన్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో మోదీ చెప్పారు. ఆదాయం పెరగటం అటుంచితే ఖర్చులు మాత్రం రెట్టింపు చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారు. విద్యుత్తు చార్జీలు పెంచి రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల చావులకు కారకులయ్యారు.
మీరు తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశ రైతులు 13 నెలలపాటు ఆందోళన చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ రైతులను అవమానపరిచేలా ఎన్నో తప్పుడు ఆరోపణలు చేశారు. రైతులను ఉగ్రవాదులు అన్నారు. ఖలిస్థానీ అన్నారు. ఆందోళనకారులపై మీ మంత్రులు కార్లు ఎక్కించి చంపారు. ఈ 13 నెలల ఆందోళనల్లో 700 మంది రైతులు వీరమరణం పొందారు. అయినా మీకు పట్టింపులేదు.
కనీసం దయలేదు. ఆ తరువాత ఏం చేశారు? స్వయంగా ప్రధానే తలవంచి దేశ ప్రజలందరికీ క్షమాపణ కోరారు. వ్యవసాయ చట్టాలు సరైనవే అయితే ఎందుకు వెనక్కి తీసుకొన్నారు? రైతులను ఎందుకు క్షమాపణ కోరారు? ఎన్నికల ముందు తియ్యటి మాటలు, ఎన్నికలు పూర్తయ్యాక పచ్చి అబద్ధాలు.. ఇదీ ప్రధానమంత్రి రీతి. రైతులు తమ కష్టానికి ప్రతిఫలం దక్కాలని అడుగుతున్నారు. వాటినీ తీర్చలేరా? రైతుల కోరికలేకాదు.. మోదీ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలెదు. ఇకపై ఇది చెల్లదు. దేశాన్ని పరివర్తన దిశగా నడిపిస్తాం.
ఈ ఆందోళనల్లో చనిపోయిన రైతుల ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. కానీ, వాళ్ల కుటుంబాల బాగోగులు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందని అప్పుడే నేను ప్రకటించాను. ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. చెప్పిన మాట ప్రకారం నేనే స్వయంగా చండీగఢ్కు వెళ్లి పంజాబ్ ప్రభుత్వ సహకారంతో ఆ రైతు కుటుంబాలకు చెక్కులు అందజేశాను. దీన్ని కూడా ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు హేళన చేస్తున్నారు. మీరు ఇవ్వరు. కనీసం ఇచ్చేవాళ్లను హేళన చేస్తారా? ఇదేనా మీ రాజకీయం? ఇలాంటి ప్రభుత్వాన్నేనా మీరు ఈ దేశంలో నడుపుతున్నది?