హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్ణాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి (జూలై 18) సందర్భంగా వారి కృషిని, పోషించిన చారిత్రక పాత్రను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమసమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో నాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడటం గొప్ప విషయమని చెప్పారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించామని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.