మంచిర్యాల : వ్యవసాయంతో పాటు కులవృత్తి మీద ఆధారపడ్డ మున్నూరు కాపు కులస్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు మున్నూరు కాపులు అత్యంత దీన స్థితిలో ఉన్నారని, స్వరాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమిచ్చారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లోమంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల మున్నూరు కాపు సంఘం నాయకులు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసన మండలి సభ్యుడు దండె విఠల్ను మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్పై కొన్ని పార్టీలు పనిగట్టుకొని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాని వారిని రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని, వారి ఆరోపణలపై ప్రజలే తిరుగబడుతున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాపులను ఎవరూ పట్టించుకోలేదని, వ్యవసాయం చేసి రాష్ట్రానికి కావాల్సిన వరి ధాన్యం, ఇతర పంటలను అందించే కాపులను చిన్న చూపు చూశారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని ప్రముఖ పదవులలో కాపులకు అవకాశం ఇస్తున్నారని, ఇందుకు కాపు బిడ్డని రాజ్యసభకు పంపించడమే నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కష్టపడే వారందరికీ గుర్తింపు ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పని చేసే వారిని గుర్తించి, వారికి పగ్గాలు అందించడమే కాకుండా వారి నుంచి సరైన ఫలితాలు రాబట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని, టీఆర్ఎస్లో ఉన్నవారంతా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం శ్రమించేవారేనని కొనియాడారు. రెండు జిల్లాల కాపు నేతలంతా ఒక్కటై తమకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని, కాపుల సమస్యలు పరిష్కరించేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటామన్నారు. ‘నన్ను పార్టీలో ఒక సైనికుడిలా, మీలో ఒకడిగా చూడాలి, మీ కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ‘మనమంతా రైతు బిడ్డలం.. మన ఇంటికి ఎవరైనా ఒకసారి భోజనం చేసి వెళ్తేనే అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. రైతుబాంధవుడు కేసీఆర్ మన రైతు కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మనం ఆయనను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి’ అని కోరారు.
టీఆర్ఎస్ పార్టీ సేవకుడిగా పని చేశానని, తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించి మరింత బాధ్యత పెంచారని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే బాగుంటుందని, కొట్లాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే మంచిదని పేర్కొన్నారు. కాపు కులస్థులకు సముచిత ఇచ్చి గౌరవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి సమస్యలున్నా కాపు కులస్తుడినైన తనకు ముందుగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాపు కులస్తులంతా కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అనంతరం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల మున్నూరు కాపు కులస్తులంతా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్తో పాటు మంత్రి గంగుల కమలాకర్ను గజమాలలు, పూలమాలలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. నాగలిని బహుమతిగా అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, మున్నూరు కాపు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సోమ శేఖర్, ఆకుల సత్తన్న, గౌరవ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్, మంచిర్యాల మున్నూరు కాపు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు బొలిశెట్టి రాయలింగు, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ బోరిగం రాజారాం, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్నూరు కాపు సంఘం మంచిర్యాల నియోజక వర్గ ఇన్చార్జి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మున్నూరు కాపు సంఘం మంచిర్యాల నియోజక వర్గం జనరల్ సెక్రటరీ ఇప్ప రమేశ్, బోయిడి రవీందర్, నస్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మంచిర్యాల 16వ వార్డు కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్, 14వ వార్డు కౌన్సిలర్ పోరెడ్డి రాజు, మాజీ కౌన్సిలర్ పడాల రామన్న, నాయకులు పడాల రవీందర్, ఆరె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.