హైదరాబాద్ : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కార అంశాలపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్లో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ విప్ మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆంత్రం సక్కు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.