కరీంనగర్ : పేద ప్రజలు సంతోషంగా ఉండాలని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా పింఛన్లు అమలు చేస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం పద్మనాయక కల్యాణమండపంలో దివ్యాంగుల(disabled) ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని అవయవాలు పనిచేసినా వక్రబుద్దితో ఉన్నవారే అసలైన దివ్యాంగులని, ఎటువంటి కల్మషం లేకపోయినా విదివశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారు దైవసమానులన్నారు.
వారు సమాజంలో చులకన భావానికి గురికాకుండా సగౌరవంతో బతకాలని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4016 పింఛన్ అందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ.6016పింఛను అందజేస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి.. కేసీఆర్ గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, తదితరులు ఉన్నారు.