హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పురుషులకు చురకలంటించారు. మహిళలపై ప్రశంసలు కురిపించారు. మహిళల సంక్షేమంపై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు.
మహిళలు ఎక్కడైతే రక్షించబడుతారో, గౌరవించబడుతారో.. ఆ దేశం బాగుపడుతుంది. సమాజం బాగుంటుంది. మహిళలు ఎక్కడైతే పూజింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తరు అని అంటారు. ఆ సమాజం బాగుంటుందని అని వేదాల్లో కూడా చెప్పారు. కానీ వాస్తవానికి మన దేశంలో అట్ల లేదు. ఎందుకు లేదంటే.. ఎక్కడైనా వ్యవస్థలో రెండు రంగాలుంటాయి. ఒకటి ఉత్పాదక రంగం.. రెండోది అనుత్పాదక రంగం. గొప్ప దేశం, సమాజం.. మహిళలు, పురుషులు, కులమతాలు అనే బేధం లేకుండా.. మంచి ప్రతిభావంతులైన మహిళలను ఉత్పాదక రంగంలో, తక్కువ ప్రతిభ ఉన్నవారిని అనుత్పాదక రంగంలో ఉంచుతారు.
మన దేశంలో ఎవడో పుణ్యాత్ముడు మాత్రం.. మహిళలు అనంగనే వంటింట్లోనే ఉండాలి అనేటట్టు తయారు చేశారు. మేం బలాదూర్గా తిరగాలి అనేటట్టు పురుషులు తయారయ్యారు. మహిళల్లో గొప్ప ప్రతిభాశాలులు ఉన్నారు. మన మగవాళ్లలో సన్నాసులు లేరా? ప్రతిభావంతులైన మహిళలను సమాజంలో ముందు వరుసలో ఉంచకపోతే ఈ దేశం బాగుపడదు. మనం 50 శాతం రిజర్వేషన్లు పెట్టుకున్నాం. కానీ మహిళా ప్రజాప్రతినిధుల వెంట వారి భర్తలు వస్తరు. ఎప్పటిదాకా అయితే మహిళలు ముందు వరుసలో రారు.. వారి ప్రతిభకు పదును పెట్టకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. మనతో పాటు వారిని సమానంగా ముందుకు తీసుకెళ్లాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. .