తెలంగాణలో జైనధర్మానికి సంబంధించిన అనేక దేవాలయాలు, జైనగురువుల విగ్రహ ప్రతిష్ఠాపనలు, జైనసంబంధ సాహిత్యం విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ చాళుక్యుల కాలంలో జైనమతం విశేషంగా ఆదరణకు లోనైందున అనేక గొప్ప దేవాలయాలు నిర్మితమైనాయి. అనేక జైనవిగ్రహాలను స్థాపించి, జైన ఆవాసాలకు విశేషంగా దానధర్మాలు నిర్వహించినట్లు శాసనాధారాలున్నాయి. వాటిలోని ఒక శాసనమే నర్సంపేట తాలూకా గోవిందపురం గ్రామంలో లభించింది. మేడరాజు కాలంలో వేయించిన ఈ శాసన కాలం శ.సం.1043 = క్రీ.శ. 1122.
ఈ శాసనం ‘శ్రీమన్నతేంద్ర మకుటోజ్వల రత్న భూషా నాగేంద్ర హస్త సరసీరుహ కన్నపూరా విద్యాధరేంద్ర రచితోత్తమ కుంకుమా వో భూయాత్సుఖాయ జినదేవ పదాంబుజశ్రీ:’ అని జినదేవుడి ప్రశంసతో ప్రారంభమైంది. తర్వాత మాధవ చక్రవర్తి అనే రాజు ఘనత వర్ణితమైంది. ఈ చక్రవర్తి ఎనిమిది వేల ఏనుగులు, పదికోట్ల గుఱ్ఱాలు, లెక్కలేనంత పదాతి దళంతో గొప్ప సైన్యం జైనదేవత అయిన యక్షేశ్వరి కరుణవల్ల కలిగి ఉన్నట్లు తెలుపుతుంది.
శాసనంలో జైనసన్యాస పరంపర విపులంగా ఉంది. ఈ పరంపరలో మొదటివాడు బాలచంద్రుడు. ఇతని శిష్యుడు మేఘచంద్ర భట్టారకుడు. ఇతని శిష్యుడు పద్మనంది. గుండరాజు మంత్రి అయిన నాగరాజు ఈ మేఘచంద్ర సిద్ధాంతదేవుని శిష్యుడు. ప్లవ నామ సంవత్సరం, ఫాల్గుణ శుక్ల తృతీయ శౌరివారం(?) నాడు నాగరాజు పార్శ్వ జినేశ్వర మూర్తిని ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు. జినేశ్వర దేవుని నైవేద్యానికి, దీపవర పూజార్థం బృహత్తటాకాన్ని, త్రితటాకాన్ని, మేడరాజు అనుమతితో మరికొన్ని తటాకాలను తవ్వించాడు.
మేడరాజు కూడా ఉత్తరాయణ సంక్రాంతి సమయంలో కొంత భూమిని స్వామికి సమర్పించినట్లు తెలుస్తున్నది. ఇంకా సూర్యగ్రహణ సమయంలో గుండరాజు, మేడరాజులు ఇద్దరూ కలిసి వారి తండ్రికి పుణ్యార్థంగా కొంత భూమిని సమర్పించి, బసదిని నిర్మించినట్లు, తపోధనుల ఆహార దానాలకు తూర్పున జగ్గ సముద్రం కింద మూడు మర్తురుల భూమి ఇచ్చినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది.
జైన సంప్రదాయాన్ని పరంపరగా సన్యాసులు కొనసాగించినా వారికి రాజులు, సామంత మాండలికుల ఆదరణ లభించింది. అందు వల్లే తెలంగాణ ప్రాంతంలో జైనశిల్పాలతో కూడిన కొలనుపాక, జైనథ్ వంటి విశిష్ట ఆలయాలు నేటికి ఆ పరంపరను కొనసాగిస్తున్నాయి.