హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశానికి సమగ్ర నీటి విధానం తీసుకొస్తామని, మహారాష్ట్రను ఐదేండ్లలో సస్యశ్యామలం చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. సోమవారం ఆయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సభలో మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్రం ప్రైవేటీకరిస్తున్న సంస్థలన్నింటిని తిరిగి జాతీయం చేస్తామని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘ఇంత పెద్ద దేశానికి ఇప్పటివరకు నీటి విధానం లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి సమగ్ర నీటి విధానం తీసుకువస్తాం. నీటిని యంత్రాలతో కృత్రిమంగా సృష్టించలేం. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన వరం. వాటిని ఎలా ఉపయోగించుకుంటామన్నది మన చేతుల్లోనే ఉన్నది. నీటికి నడక నేర్పాలి. మన అవసరాలు తీర్చుకోవాలి. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన సంపదను మనం సముద్రంపాలు చేస్తున్నాం. సముద్రం పాలైన నీటిని చూసి దుఃఖిస్తున్నాం. ఇది మారాలి. ఔరంగాబాద్ వేదికగా స్పష్టమైన హామీ ఇస్తున్న. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అధికారం అప్పగించండి. కేవలం ఐదేండ్లలో మహారాష్ట్రలో నీటి కొరత తీరుస్తాం. ప్రతి రైతు వ్యవసాయ భూమికి నీళ్లు ఇస్తాం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తాం. తెలంగాణ మాడల్ను అమలుచేస్తాం. తెలంగాణాలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీటిని అందిస్తున్నాం. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని ప్రజలు ఏ నీళ్లు తాగుతున్నారో.. ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గూడెంల ప్రజలకు కూడా అదే నాణ్యమైన నీటిని అందిస్తున్నాం. మహారాష్ట్రలో కూడా ఈ తరహా పథకం సాధ్యమే. మేం చేసి చూపిస్తాం. ప్రభుత్వం మాకు అది చేయడం లేదు ఇది చేయడం లేదంటూ ఏడ్వడం.. పెడబొబ్బలు పెట్టడం బంద్ చేద్దాం. మన కోసం మనం కొట్లాడుదాం. కొట్లాడితేనే ఏదైనా వస్తది. ఎవరో వస్తరు.. ఏదో చేస్త్తరనుకోవడం మన భ్రమనే.
వాళ్లది ప్రైవేటైజేషన్.. మాది నేషనలైజేషన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోజులో మూడు గంటలపాటు కరెంటు వస్తే ఎక్కువ. పరిశ్రమలకు పవర్ హాలిడే ఉండేది. వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికైతే ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నాం. మహారాష్ట్ర కన్నా తెలంగాణ చాలా చిన్నది. తెలంగాణాలో సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? ముమ్మాటికీ సాధ్యమవుతుంది.
ఇక్కడి నేతలకు చిత్తశుద్ధిలేదు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. అందుకే ఇక్కడ విద్యుత్తు కోతలు. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దేశంలో రాబోయే 150 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. దీంతోపాటు అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, కేంద్రానికి చిత్తశుద్ధిలేదు. దేశాన్ని చీకటిలోకి నెట్టే ఉంచుతున్నారు. ఇది నేను మాత్రమే చెప్పడంలేదు. విద్యుత్తు రంగ నిపుణులు చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధం.
దేశంలో విద్యుత్తు రంగంలో కూడా ప్రైవేటు సంస్థల ఆధిపత్యమే ఉండేలా చూస్తున్నారు. మన ప్రజల ధనంతో, మన కార్మికుల శ్రమతో నిర్మితమైన సంస్థలను తమ స్నేహితులకు కట్టబెడుతున్నారు. ఇది సరికాదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేసిన సంస్థలను తిరిగి నేషనలైజేషన్ చేస్తాం. వాళ్లది (బీజేపీ) ప్రైవేటైజేషన్ అయితే.. మాది నేషనలైజేషన్. జాతి సంపదను కాపాడుతాం.
తలాటీ వ్యవస్థను రద్దు చేస్తాం
తలాటీ (వీఆర్వో)లు రైతులకు న్యాయం చేయడంలేదు. ఈ వ్యవస్థను తెలంగాణలో రద్దు చేశాం. మహారాష్ట్రలో కూడా రద్దు చేస్తాం. తలాటీలు సీఎంలను కూడా శాసించేలా తయారయ్యారు. రైతులను వేధిస్తున్నారు. సమగ్ర అధ్యయనం తర్వాత తెలంగాణలో ఈ వ్యవస్థను పూర్తిగా తొలగించి రికార్డులన్నీ డిజిటలైజ్ చేశాం. ధరణి పేరుతో వ్యవస్థను రూపొందించాం. భూముల వివరాలన్నీ ధరణిలో ఉంటాయి. తానాషాహీలు ఉండవు. దఫ్తర్లు, దస్ర్తాలతో సంబంధం లేకుండా పారదర్శక విధానాలను తీసుకొచ్చాం. ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరంలేకుండా చేశాం. రైతు బంధు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నాం. రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా ఉన్నది. రైతు మరణించిన 8 రోజుల్లోనే వారి ఖాతాల్లో రూ.5 లక్షలు జమ చేస్తారు. రైతులు పండించే ధాన్యాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం కొనే వ్యవస్థ తెలంగాణలో ఉన్నది. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయిస్తున్నాం. సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నాం.
ఎందుకు భారత్ బజార్లు రాలేదు?
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించక ముందు దారుణమైన పరిస్థితులు తెలంగాణాలో ఉండేవి. రైతులకు నీళ్లు ఉండేవి కావు. ఎరువులు, విత్తనాలు దొరికేవి కావు. నాణ్యమైన విద్యుత్తు లభించేది కాదు. రైతు ఆత్మహత్యలుండేవి. వీటన్నింటిని అధిగమిస్తూ వచ్చాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్కుమార్ మంచి విధానాలు రూపొందించి, అమలుచేశారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా అని కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్పింది. ఇట్లాంటి మజాక్లు ఎందుకు చేస్తున్నారు? మేకిన్ ఇండియా అని చెప్తున్నారు. ఔరంగబాద్లో ఉన్న చైనా బజార్ల పరిస్థితేమిటి? ఎందుకు భారత్ బజార్లు రాలేదు?
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్
మహారాష్ట్రలో అన్ని వనరులున్నా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నా రు. ఇంకెన్నాళ్లు రైతులు ఇలా ఓటర్లుగానే ఉంటారు? రైతులు నాయకులు కావాలి. అందుకే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ పిలుపు ఇస్తున్నాం.
రైతులే చట్టసభల్లోకి అడుగుపెట్టాలి. తమ శాసనాలను తామే రచించుకోవాలి. రైతన్నలు చట్టసభల్లో ఉండాలి. అతి త్వరలోనే మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికలున్నాయి. వాటిలో మీ సత్తా చూపించండి. జిల్లా పరిషత్లపై గులాబీ జెండా ఎగురవేయండి. మీ సమస్యలు ఎలా పరిష్కారం కావో చూద్దాం.
నాందేడ్లో బీఆర్ఎస్ సభ పెట్టిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రతీ రైతుకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించింది. ఇది మనం సాధించిన తొలి విజయం. ప్రతి ఎకరానికీ ఏడాదికి రూ.10 వేలు ఇవ్వాలి. మహారాష్ట్రలో కేసీఆర్కు ఏం పని? ఇక్కడకు ఎందుకు వస్తున్నడు? అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నాడు. కేసీఆర్ మహారాష్ట్రకు రావద్దంటే.. ఇక్కడి రైతులందరికీ తెలంగాణ మాడల్లో పథకాలను అమలు చేయాలి. వాళ్లు అమలు చేస్తే మహారాష్ట్ర వదిలి మధ్యప్రదేశ్కు వెళ్తా.
ధనమున్నది.. మనసే లేదు
మహారాష్ట్రలో నిధులకు కొదవలేదు. ఆర్థికంగా ప్రభుత్వానికి లోటు లేదు. పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. ధనమున్నది కానీ, మనసే లేదు. రైతులను కాపాడుకోవాలన్న సోయి పాలకులకు లేదు. ఒక్కసారి జిల్లా పరిషత్లపై గులాబీ జెండా ఎగిరితే.. ఢిల్లీ కదిలివస్తుంది.
ఇన్ని నదులున్నా తాగేందుకు నీళ్లేవి?
మహారాష్ట్రలోని ప్రతి ప్రాంతం నుంచి అద్భుతమైన నదులు ప్రవహిస్తున్నా ఇప్పటికీ కరవు తీవ్రంగా ఉన్నది. నేను ఇక్కడి నేతలతో, ప్రజలతో సంభాషిస్తున్నపుడు వారు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయాను. ఇక్కడ (ఔరంగాబాద్లో) 8 రోజులకోసారి తాగునీళ్లు వస్తున్నాయని మా నాయకులు వేణగోపాలాచారి, జీవన్రెడ్డి చెప్పారు. అకోలాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదని పాటిల్ చెప్పారు. కిలోమీటర్ల కొద్ది నడిచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇదెక్కడి దౌర్భాగ్యం? మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు మరే రాష్ట్రంలోనూ లేవు. గోదావరి, కృష్ణ, మంజీరా, బీమా, పెన్గంగ, ఘటప్రభ, పంచ గంగా, ప్రవరా, మూల ఎన్ని నదులున్నాయి. పక్కనే నదులున్నా ఇంత గోసనా? తాగడానికి నీళ్లు ఇవ్వరా? ప్రజలు ఏమడుగుతున్నారు. బంగారం అడుగుతలేరు, చందమామ కావాలంటలేరు. చుక్కలను అడుగుతలేరు. వాళ్లు అడుగుతున్నది తాగే నీళ్లు. ఇన్ని ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత తాగడానికి నీళ్లు ఇవ్వలేరా? మన నాయకులు పెద్దపెద్ద మాటలు చెప్తుంటారు కానీ మంచినీటిని కూడా ఇవ్వలేని దుస్థితిలో దేశం ఉండటమేమిటి? మనకన్నా చిన్న దేశం జింబాబ్వే ఆరున్నర వేల టీఎంసీలతో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టుకున్నది. మహారాష్ట్రలో దాంట్లో పదోవంతు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అయినా ఉన్నదా? మన దేశంలోని పాలకులకు నీటిపై అవగాహన ఉన్నదా? జింబాబ్వేలో కట్టినట్టు మన దేశంలో కనీసం 5-6 ప్రాజెక్టులు కట్టవచ్చు. పాలకుల నిర్లక్ష్యంతోనే మనకు సమస్య. మనం ఇంకెన్నాళ్లు ఇట్లా ఉందాం? ప్రాజెక్టులు కట్టకుండా ఇలాగే ఉందామా? మహారాష్ట్ర రైతాంగం ఆలోచించాలి.