హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి నియమితులయ్యారు. ఆమె రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి నూకల రాంచంద్రారెడ్డి మనుమరాలు దీపికారెడ్డి. రాంచంద్రారెడ్డి కూతురు రాధారెడ్డి, వీఆర్రెడ్డి దంపతులకు 1965 సెప్టెంబర్ 15న దీపికారెడ్డి జన్మించారు. 1976లో తొలిసారి ఆమె రంగస్థల ప్రవేశం చేశారు. దీపికారెడ్డి కూచిపూడి నాట్య కళా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం శిష్యురాలిగా నాట్యకళను ఔపోసన పట్టారు. కూచిపూడి నాట్య రంగంలో 50 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో నిర్విరామ కృషి, అంకితభావం, అద్భుత ప్రతిభకు గుర్తింపుగా అనేక బిరుదులు, సతారాలు వరించాయి. 2017లో జాతీయ అవార్డును, 2016లో స్టేట్ అవార్డును స్వీకరించారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన దీపికారెడ్డి
దీపికారెడ్డి సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను కేసీఆర్ అభినందించారు. వరంగల్, మహబూబాబాద్లో నూకల రాంచంద్రారెడ్డి విగ్రహాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని సీఎం తనతో చెప్పారని దీపికారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి పాల్గొన్నారు. దీపికారెడ్డికి పదవి రావడంపై మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు.