హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని సోమాజిగూడలోని యశోద దవాఖాన వైద్యబృందం స్పష్టంచేసింది. నీరసం, ఎడమ చేతి నొప్పి నేపథ్యంలో సీఎం కేసీఆర్ శుక్రవారం యశోద దవాఖానకు వెళ్లారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు, చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రమోద్కుమార్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విష్ణురెడ్డి సారథ్యంలోని వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. అనంతరం వారు దవాఖానలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టంచేశారు. ఆయన రెండు రోజులుగా నీరసంగా ఉన్నారని, రోజూ ఇంట్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఎడమ చేయి నొప్పిగా ఉన్నదని చెప్పడంతో మరోసారి పరీక్షించామని, దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకొంటే మంచిదని సూచించామని చెప్పారు.
ఏటా ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్కు సాధారణ వైద్య పరీక్షలు చేస్తుంటామని, ఇందులో భాగంగానే దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించామని పేర్కొన్నారు. ఆయన అంగీకరించడంతో దవాఖానకు తీసుకొచ్చినట్టు తెలిపారు. ముందుగా కరోనరీ యాంజియోగ్రామ్ చేశామని, రక్త నాళాల్లో ఎలాంటి అవాంతరాలు లేవని వివరించారు. గుండె పనితీరును తెలుసుకొనేందుకు ఈసీజీ, 2డీ ఎకో 4 టెస్టులు కూడా చేశామని, ఆ రెండూ బాగున్నాయని వెల్లడించారు. అనంతరం గుండెకు సంబంధించిన కొన్ని రక్త పరీక్షలు చేశామని, నార్మల్గా వచ్చాయని చెప్పారు. వీటి ఆధారంగా ఆయన గుండె ఆరోగ్యంగా ఉన్నదని నిర్ధారించామని పేర్కొన్నారు. ఎడమ చేయి నొప్పి రావడానికి వేరే కారణాలు ఉన్నాయేమో తెలుసుకొనేందుకు మెడ, మెదడుకు సంబంధించి ఎంఆర్ఐ టెస్టులు చేశామని తెలిపారు. ఎంఆర్ఐలో కొంత ఇబ్బంది కనిపించిందని అన్నారు.
సీఎం కేసీఆర్ ఎక్కువగా వార్తా పత్రికలు చదువుతుంటారని, ఐ ప్యాడ్ చూస్తూ ఉంటారు కాబట్టి కొంతమేర సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య వచ్చిందని తేలిందని వైద్యులు వివరించారు. గుండె, లివర్, మూత్రపిండాలు బాగున్నాయని, కొలెస్టరాల్ లెవల్స్ మోతాదులోనే ఉన్నాయని తెలిపారు. సీఎం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, బీపీ, షుగర్ కాస్త నియంత్రించుకోవాలని సూచించామని చెప్పారు. సీఎం ఈ మధ్య ఎకువగా పర్యటనలు చేస్తుండటం వల్ల కొంచెం నీరసంగా ఉన్నట్టు గుర్తించామని అన్నారు. వారం రోజులపాటు విశ్రాంతి అవసరమని సూచించామని వెల్లడించారు. ఇకపై ప్రతి వారం రక్త పరీక్షలు, గ్లూకోజ్ స్థాయి పరీక్షలు చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ కింద పడ్డారా? అన్న అనుమానాలను డాక్టర్లు కొట్టిపారేశారు. వయసు రీత్యా వచ్చే సమస్యలు తప్ప బాగానే ఉన్నారని మరోసారి స్పష్టంచేశారు. వారం రోజుల తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ధీమా వ్యక్తంచేశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రగతిభవన్కు చేరుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం వెంట కుటుంబసభ్యులు సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మనుమడు హిమాన్షు, ఎంపీ సంతోష్కుమార్, మంత్రి హరీశ్రావుతోపాటు మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రెడ్యానాయక్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ సీవీ ఆనంద్, డీసీపీ జోయల్ డేవిడ్ తదితరులు ఉన్నారు.