రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్లో శనివారం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు. భారత రాజకీయాల్లో యశ్వంత్సిన్హాది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
ఓటు వేసేటప్పుడు రాష్ట్రపతి అభ్యర్థులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని, రెండు రోజులు ఇక్కడే ఉంటారన్నారు. ప్రతిపక్షాలపై ప్రధాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాము వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేర్చలేదన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా ఆయన నెరవేర్చిన హామీలు ఒక్కటీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర సర్కారు డీజిల్ సహా అన్ని ధరలు పెంచేసిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇవి చాలదన్నట్లు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, ఉద్యమంలో కొందరు రైతులు మృతిచెందారన్నారు. వారి కుటుంబాలకు తాము రూ. 3 లక్షలు ఇస్తే, బీజేపీ తమను చులకనగా చూసిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.