హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. పాడిపశువులు, పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకం తదితర రంగాలు దేశ జీడీపీ వృద్ధికి దోహదం చేస్తున్నాయని వివరించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో.. కాంపౌండ్ లైవ్స్టాక్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (క్లిఫ్మా) నిర్వహిస్తున్న 62వ జాతీయ సింపోజియంను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపాల మాట్లాడుతూ.. కోట్లాది కుటుంబాలకు జీవనాధారమైన వ్యవసాయంతోపాటు పశుసంపదకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. నాణ్యమైన పశువుల దాణా ఉత్పత్తి కోసం పశువైద్య విశ్వవిద్యాలయం పరిశోధనలు చేయాలని మంత్రి తలసాని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల బలోపేతానికి చేపట్టిన చర్యలను వివరించారు. పాలు, మాంసం ఉత్పత్తి, గొర్రెల పెంపకం తదితర రంగాల్లో ఏడేండ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని, కేంద్రం కూడా సహకారం అందించాలని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. సదస్సులో పార్లమెంట్ సభ్యులు వివేక్ దేశ్పాండే, నిర్మల్ శ్రీవాస్తవ, క్లిప్మా కన్వీనర్ విజయ్ బండారి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఓపీ దరి, బీబీ పాటిల్, సురేష్ దేవర తదితరులు పాల్గొన్నారు.