హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించిన ద్విభాషా పుస్తకాలను అందజేయనున్నారు. వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియాన్ని 9వ తరగతి వరకు పొడిగించనుండటంతో ప్రత్యేకంగా పుస్తకాలను సిద్ధం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 1 నుంచి 8 తరగతుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023 -24లో 9వ తరగతి, 2024 -25లో 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించారు. ఈ విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి వారికి పూర్తి ఇంగ్లిష్ మీడియం, 2 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కుడి వైపు తెలుగు, ఎడమ వైపు ఇంగ్లిష్లో పాఠ్యాంశాలున్న ద్విభాషా పుస్తకాలను అందజేశారు. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతిలో ద్విభాషా పుస్తకాల ముద్రణకు ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ ఏర్పాట్లుచేస్తున్నది.
11వేల టన్నులు..
ఉచిత పాఠ్య పుస్తకాల ముద్రణకు 11,680 టన్నులు, కవర్పేజీల ముద్రణకు మరో 2వేల టన్నుల పేపర్ అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు టెండర్లు ప్రక్రియను చేపట్టారు. వచ్చే ఏడాది 2 కోట్ల పుస్తకాలను ఉచిత పుస్తకాలను ముద్రించేందుకు పేపర్ సేకరణకుగాను సంస్థ టెండర్లు పిలిచింది. ఈ ఏడాది పుస్తకాలు చిరిగిపోకుండా పదికాలాల పాటు ఉండేందుకుగాను పేజీల మందాన్ని పెంచారు. ఇదివరకు 70 జీఎస్ఎం (గ్రామ్స్ ఫర్ స్క్వేర్ మీటర్) పేపర్ను వినియోగించగా, తాజాగా 90 జీఎస్ఎం పేపర్ను వాడాలని నిర్ణయించారు.