వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండా పరిధిలోని మర్రి తండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రమావత్ గ్యాస్య, రమావత్ రేఖ్య మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న భూవివాదం నేపథ్యంలో శుక్రవారం రాత్రి కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ ఘటనలో రమావత్ గ్యాస్య, రమావత్ రేఖ్యతో పాటు కిరణ్, రాజేందర్, నవీన్, జీవన్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘర్షణ గురించి సమాచారం అందుకున్న రాయపర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.