TS-bPass | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్మాణరంగంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్లో ఉన్నాయి. పేద, మధ్య తరగతి, ఉన్నత తరగతివారు నిర్మించుకునే అన్ని రకాల ఇండ్ల నిర్మాణాల్లో ఈ రెండు జిల్లాలే ముందువరుసలో నిలిచాయి. మూడేండ్లుగా ఈ జిల్లాల్లో అత్యధిక నిర్మాణాలు జరుగుతున్నాయి. టీఎస్బీపాస్ లెక్కల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తొలి స్థానం, మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వీటి తర్వాత హనుమకొండ మూడోస్థానంలో ఉన్నది. టీఎస్బీపాస్కు ఇప్పటి వరకు 2,17,303 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,57,091 దరఖాస్తులను ఆమోదించగా వివిధ కారణాలతో 45,148 దరఖాస్తులను తిరస్కరించారు. ఇతర దరఖాస్తులు డాక్యుమెంట్స్ సమర్పించకపోవటం, ఫీజు పెండింగ్లో ఉండటం తదితర కారణాలతో వివిధ దశల్లో ఉన్నాయి. టీఎస్బీపాస్ ద్వారా ఇండ్లకు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, లేఅవుట్ అనుమతులు ఇస్తున్నారు.
దీంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇండ్ల యజమానులు ఆన్లైన్లోనే అనుమతులు పొందుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు పూర్తి కావటంతో శివారు జిల్లాల వైపు ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలను అభివృద్ధి చేస్తుండటం, ఐటీ హబ్ల ఏర్పాటు, మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో ద్వితీయ శ్రేణి పట్టణాలైన హనుమకొండ లాంటి వాటిల్లో నిర్మాణాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని టీఎస్బీపాస్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.