హైదరాబాద్ : పుస్తకం చదవడం గొప్ప అభ్యాసం, అవసరమని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పుస్తకం హస్తభూషణంగా ఉండేదని, ప్రస్తుతం సెల్ఫోన్ హస్తభూషణంగా మారిందన్నారు. యువతరం ప్రదర్శనశాలకు రావడంతో ఆశలు చిగురించాయన్న ఆయన.. పుస్తకం సజీవంగా ఉంటుందనే నమ్మకం కలిగిందన్నారు.
స్కూళ్లు, కాలేజీల్లో ల్రైబరీలున్నాయని అనుకోవట్లేదని, గతంలో పెద్ద భవనాలు లేకున్నా లైబ్రరీ, గ్రౌండ్ ఉండేవని గుర్తు చేసుకున్నారు. తాను జీవితంలో పైకి రావడానికి తమ గ్రామంలో లైబ్రరీ ఉపయోగపడిందని, నిత్యం 2-3 గంటలు గ్రంథాలయంలో పుస్తకాలు చదివినట్లు తెలిపారు. జీవితంలో పైకి రావడానికి అప్పటి జ్ఞానం ఉపయోగపడిందని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
స్కూల్లో లైబ్రరీ, గ్రౌండ్ నిబంధన ఎవరూ పాటించడం లేదని, ప్రభుత్వమే పూనుకొని సమస్యను పరిష్కరించాలని సీజేఐ పిలుపునిచ్చారు. డిజిటల్ యుగంలో పుస్తకం చదివే పని లేకుండా పోయిందని, పుస్తకం ఎవరో చదివితే వినే పరిస్థితి ప్రమాదకర ధోరణి అన్నారు. పుస్తకం, పేపర్ చదివితే మెదడులో ముద్రపడిపోతుందని, ఎవరో చదివితే అప్పటి పూర్తిగానే ఉంటుంది తప్ప.. అర్థం కాదని సీజేఐ అన్నారు.
వ్యాయామం, పుస్తకం పఠనం ఎంతో మార్పును తీసుకువస్తాయని, చదువుతో పాటు పిల్లలకు క్రీడాస్ఫూర్తిని అలవాటు చేయాలని పిలుపునిచ్చారు. సాహిత్యం ప్రపంచ గతిని మార్చిందని, మన భావాలను పిల్లలు, స్నేహితులకు వ్యక్తీకరించగలగాలి అన్నారు. లేఖలు రాసే సంస్కృతి పూర్తిగా నాశనమైందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సందేశం కమ్యూనికేట్ చేయడానికే ఉపయోగపడుతుందని, సుదీర్ఘ భావాలు వ్యక్తీకరించడానికి సందేశం ఉపయోగపడదన్నారు.